జయశంకర్ భూపాలపల్లి, మే 30(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విద్యుత్తురంగం ఎంతో అభివృద్ధి చెందిందని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ఎంతో దూరదృష్టితో రూ.34 వేల కోట్ల వ్యయంతో దామరచర్ల (మిర్యాలగూడ)లో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఈ ఏడాది 2 యూనిట్లు, మిగిలిన యూనిట్లు మరో 6 నెలల్లో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ (విద్యుత్తు ప్రగతి భవన్) భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టే ముందు ప్రాజెక్టుకు అవసరమైన 6,500 మెగావాట్లు అందిస్తామా? అన్న అనుమానం ఉండేదని, దాన్ని పటాపంచలు చేస్తూ ఇప్పుడు ప్రాజెక్టుకు ఎంత అవసరమైతే అంత విద్యుత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు నాలుగైదు వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సగటు విద్యుత్తు వినియోగం 1,136 యూనిట్లు ఉంటే ప్రస్తుతం 2,140 యూనిట్లు ఉన్నదని చెప్పారు.