హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా జారీచేసిన గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేసేందుకే ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా నోటిఫికేషన్లోని 503 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చినవేనని, వాటికి అదనంగా మరో 60 పోస్టులు మాత్రమే కలిపి ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. గత నోటిఫికేషన్ను రద్దు చేయడం ద్వారా మొత్తం పోస్టులను తామే భర్తీ చేశామని చెప్పేందుకే ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ జారీచేసిందని విమర్శించారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అక్టోబర్ వరకు కొనసాగుతుందని, దీనివల్ల నిరుద్యోగులు తమ విలువైన సమాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో జాబ్ క్యాలెండర్పై కానీ, నోటిఫికేషన్లపై కానీ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గ్రూప్-2 కోసం మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వకుండా పాతదానినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొ గతంలో జాబ్ క్యాలెండర్ అన్న కోదండరాం ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పాత నోటిఫికేషన్ల ద్వారానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామన్న హామీ ఏమైంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వెంటనే పరీక్షలు నిర్వహించాలి. యాదాద్రి, సూర్యాపేటలో నలుగురు గురుకుల విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఎక్కడ? ఎమ్మెల్సీ కవిత బాధితుల కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే రేవంత్ ప్రభుత్వం నియామకపత్రాలు అందిస్తున్నది.
-బాలు, బీఆర్ఎస్వీ నాయకుడు