హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల కొలువులకు ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు పంచుతూ తమ ఘనతగా బిల్డప్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ఉద్యోగాలన్నీ తామే ఇచ్చినట్టు ఎల్బీ స్టేడియంలో సభలు నిర్వహించి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఫైరయ్యారు. గురువారం తెలంగాణభవన్లో వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోలకు పోజులు ఇచ్చి ఉద్యోగాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చినట్టు ప్రచారం చేసుకోవడం తగదని మండిపడ్డారు.
ఉద్యోగ నియామకాలపై రేవంత్రెడ్డికి కనీస అవగాహన లేదని, దమ్ముంటే అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 60 రోజుల రేవంత్రెడ్డి పరిపాలన చూ స్తుంటే పరిపాలన నిల్లు, పబ్లిసిటీ ఫుల్లు అన్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ నేత, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఉద్యోగ నియామకాల కష్టాన్ని తన ఖాతాలో వేసుకొని రేవంత్రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ గురుకులాల్లో తొమ్మిది క్యాటగిరీల్లో 8,231 పోస్టులకు గత ఆగస్టులోనే కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఆఖరు నిమిషంలో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో నియామక ప్రక్రియ నిలిచిందని, ఇప్పుడు వాళ్లకు పోస్టింగ్ ఆర్డ ర్లు ఇస్తూ.. తమ ప్రభుత్వ ఘనతగా కాంగ్రెస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు.