ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 21: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై కాలుమోపితే తన్ని తరిమికొడతామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంఘటన్ అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శ్రమిస్తుంటే.. రాజకీయాల కోసం వారి జీవితాలతో రేవంత్రెడ్డి చెలగాటం అడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రాజకీయ మనుగడ కోసం దీక్ష డ్రామాకు తెరలేపాడని సంఘటన్ నేతలు మంగళవారం విమర్శించారు. ఎంతో ప్రతిభ ఉంటేగాని ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సాధించడం సాధ్యం కాదని, అలాంటి ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని అవమానించిన కుసంస్కారి రేవంత్రెడ్డి అని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ సర్కారుపై నిరాధార ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పేపర్ లీకేజీకి అద్యుడే రేవంత్రెడ్డి: గెల్లు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. రేవంత్ను నిరుద్యోగుల వ్యతిరేకిగా అభివర్ణించారు. ఓయూకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలో రేవంత్ పాత్ర ఉన్నదని, అందుకే సిట్ విచారణ జరుగకుండా నిందితుడు రాజశేఖర్రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు నింపడం లేదని, కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న రేవంత్ తక్షణమే పీసీసీ అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో అడుగుపెట్టే నైతిక అర్హత రేవంత్కు లేదని స్పష్టంచేశారు. ఓయూకు వస్తే తన్ని తరుముతామని హెచ్చరించారు. కాంగ్రెస్ విద్యార్థి నేతలే రేవంత్పై గతంలో దాడి చేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాందాల భాస్కర్, బండారి వీరబాబు, తొట్ల స్వామి, కడారి స్వామి, కిరణ్గౌడ్, రఘురాం, హరిబాబు, శిగ వెంకట్, చటారి దశరథ్, నవీన్గౌడ్, కృష్ణ, రమేశ్గౌడ్, నాగేందర్రావు, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
అవకాశవాది రేవంత్రెడ్డి ఖబర్దార్
నిరుద్యోగులను స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే ఊరుకోం. గతంలో రేవంత్రెడ్డి ఓయూ విద్యార్థుల గురించి చులకనగా మాట్లాడి, నేడు అదే విద్యార్థులను తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నాడు. వ్యక్తిగత పేరు కోసం పాకులాడే రేవంత్ ఇప్పటి వరకు ఒక్క ప్రజా పోరాటం కూడా చేయలేదు. రేవంత్ ఏ ముఖం పెట్టుకుని ఓయూకు వస్తున్నావు. బేషరతుగా ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పు.
– ఎల్చల దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు ఎంబీసీ విద్యార్థి సంఘం,
– శ్రీనునాయక్, అధ్యక్షుడు, గిరిజన విద్యార్థి విభాగం
రేవంత్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పు
ఓయూ విద్యార్థులపై అవాకులు, చవాకులు పేలిన రేవంత్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటాం. రాష్ట్రస్థాయిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులే ఓయూలో చదువుకునేందుకు వస్తారు. అటువంటి వారిని అవమానించిన కుసంస్కారి రేవంత్ ఓయూ గడ్డపై కాలుమోపితే తన్ని తరుముతాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై రేవంత్, బండి సంజయ్ అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోం.
– తుంగ బాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఓటుకు నోటు దొంగ రేవంత్
ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి ఓయూకు వస్తే బడితెపూజ తప్పదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏం చేయాలో తోచక దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపాడు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. రేవంత్రెడ్డి బీజేపీకి బీ టీంగా మారాడు. తెలంగాణలో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు.
– బండారు వీరబాబు, అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం