హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యాసంవత్సరంలో మేఘనారెడ్డిని పీజీలో చేర్పించుకునేందుకు ప్రతిపాదనలు పంపినట్టు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఐఐఎం ఇండోర్, కాశీపూర్, అమృత్సర్, బుద్ధగయ, నల్సార్, హైదరాబాద్, ఢిల్లీ వర్సిటీల నుంచేగాక ఇంకా ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ విద్యాసంస్థల్లో చేరాలని కోరినట్టు వారు తెలిపారు.
మేఘనారెడ్డి తొమ్మిది సీజీపీఏ (90శాతానికి పైగా మార్కులు) సాధించడమే కాకుండా పదికి పైగా గీతమ్ క్లబ్లు, విద్యాసంబంధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో ముందుండి తనదైన శైలిలో రాణించిందని చెప్పారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న మేఘన సహ రచయితగా నాలుగు సంకలనాలను ప్రచురించినట్టు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విషయాల్లో అవగాహన పెంచుకోవడం ఆమెకు లాభం చేకూర్చిందని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన క్యాట్లోను ఆమె విజయం సాధించిందని వెల్లడించారు. ఇలాంటి గొప్ప అవకాశం మేఘనకు రావడం సంతోషంగా ఉన్నదని అధికారులు తెలిపారు. మేఘన, ఆమె తల్లిదండ్రులను యూనివర్సిటీ అదనపు కులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అభినందించారు.