హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): గత ఏడేండ్లలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇన్నేండ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘మీ ఏడేండ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టిన్రు? ఒక్క మంచి పని ఉన్నదా? దళితులకు, గిరిజనులకు, బీసీలకు, రైతులకు, నిరుద్యోగులకు ఏమైనా చేసిన్రా? ఒక్క మాటమీదనన్నా నిలవడ్డరా? 15 లక్షలు ఇస్తమన్నరు ఇచ్చిన్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన్రా? ఒక పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా అడుగుతున్నా.. మీరు ఏ మాట మీద నిలబడ్డరు? మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలే, ఓట్లు దండుకోవాలె. ఇదా రాజకీయం? ఏడేండ్లల్ల దేశం మొత్తాన్ని నాశనం పట్టిచ్చిన్రు. జీడీపీ మంట కలిసింది. ఫుడ్ సెక్యూరిటీ నాశనం అయ్యింది. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా ఇండియా జీడీపీ తక్కువ ఉన్నది. ఇదా పాలించే పద్ధతి? తప్పు ఎవరిది? మీకు చేతగాక, పాలన చేయరాక, అడ్డగోలుగా పన్నులు పెంచి, ప్రజల మీద భారం మోపిన్రు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటీకరిస్తున్నరు. ఎల్ఐసీ అద్భుతమైన సంస్థ. అది కేంద్రానికి ఉల్టా లక్షల కోట్లు ఇస్తది. దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నరు? బ్రహ్మాండమైన ప్రభుత్వసంస్థలను నిర్వీర్యం చేసే మీరా మాట్లాడేది?
ధాన్యంపై కేంద్రం విధానమేంది?
రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రం మీద ఎన్నో ఒత్తిళ్లు పెడుతుంది. ప్రతి బాయికాడ కరెంటు మీటర్ పెట్టాలని అంటున్నరు. వద్దని నేను రెండేండ్ల నుంచి పోరాడుతున్న. మా రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నం, బిల్లులు మేమే కట్టుకుంటం అని చెప్తే, రాష్ర్టానికి వచ్చే రుణాలను బంద్ చేస్తమని బ్లాక్మెయిల్ చేస్తున్నరు. ఇన్నిరోజుల నుంచి మర్యాదగా, పద్ధతిగా, కొత్త రాష్ట్రం కాబట్టి సెటిల్ చేసుకుందాం అనే ధోరణిలో చూసినం. అయినా ప్రతి విషయానికి ఉల్టా పల్టా మాట్లాడుతున్నరు. అబద్ధాలు చెప్తున్నరు. ఇప్పుడు తగులుకుంటం కదా.. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో మాట్లాడుతం. ప్రజలకు మీరేం చేసిన్రో, మేమేం చేసినమో చెప్తం. ఇప్పటిదాకా ఓపికపట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్రం ఎంబడి పడుతం. ఇక్కడున్న బీజేపీ ఎంబడి పడుతం. సమస్యలకు ఎవడు జావాబు చెప్పాల్నో, ఎవరు బాధ్యత వహించాల్నో, ధాన్యం సంగతి ఏందో తేలుస్తం. కేంద్ర ఆహారశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నా.. ధాన్యం విషయంలో కేంద్ర విధానాన్ని ప్రకటించాలి. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయవద్దు. రైతులను మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ల బతుకులను ఆగం చేస్తమంటే కేసీఆర్ ఒప్పుకోడు.
విభజన హామీలు ఏమైనయి?
కనీసం రాష్ట్ర విభజన చట్టాన్ని కూడా అమలు చేస్తలేరు. ట్రైబల్ వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ.. ఏవీ ఇవ్వలేదు. సోకాల్డ్ బీజేపీ అధ్యక్షుడుగానీ, ఇక్కడున్న కేంద్ర మంత్రిగానీ తెలంగాణల పది రూపాయల పని చేసిన్రా? మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రాం, దానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలే. నీటి వాటా తేల్చరు. ఐదేండ్లు కొట్లాడితే హైకోర్టు ఇచ్చిర్రు. ఉల్టా మల్లా మీరే మాట్లాడుతరా? మీ మెడలు ఇరుస్తం బిడ్డా జాగ్రత్త. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె. పిచ్చి కూతలు కూసినా ఇన్నాళ్లు క్షమించి వదిలిపెట్టినం. మాకు చాతగాక కాదు. మాకున్న క్యాడర్కు, మాకున్న శక్తికి మిమ్మల్ని తరిమికొట్టగలుగుతం. మాకు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నరు. మిత్రపక్షం మజ్లిస్ కలిపితే మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 110 మంది బలం ఉన్నది. మేమంతా ప్రజలు నామినేట్ చేస్తే వచ్చినం. రైతులు నామినేట్ చేస్తే వచ్చినం. ఢిల్లీకెళ్లి నామినేట్ చేస్తే రాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతం, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతమంటే మీ మెడలు ఇరుస్తం జాగ్రత్త.
గోకాసురులను నలిపి పారేస్తం
ప్రాజెక్టులల్ల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నరు. కేసు పెట్టు దమ్ముంటే. ఎంక్వైరీ చేయండి.. మేము రెడీ. నాలుక ఉన్నది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతం అంటే ఊరుకోం. కుక్కలు మొరిగినట్టు మొరుగుతే సహించం జాగ్రత్త.. బీ కేర్ఫుల్. మేము ఉద్యమాలు చేసినోళ్లం. మహామహా రాకాసులతో కొట్లాడినోళ్లం. ఈ గోకాసురులు ఒక లెక్కనా? నలిపి పారేస్తం. తమాషా చేస్తున్నరా? మీరు చేయాల్సినవి చేస్తలేరు. అయినా మేము అనేక సందర్భాల్లో సహకరించినమని మీ ప్రధానికి కూడా చెప్పిన. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, అనేక బిల్లులు పాస్ చేసేటప్పుడు సహకరించినం. అయినా మాపై ఇట్లా ఎందుకు చేస్తున్నరని అడిగిన. సంస్కారవంతంగా ఉండాలని చెప్పిన. అయినా కుసంస్కారుల్లాగా దిగజారిపోయి రాజకీయాలను, రాజకీయ విలువలను దిగజార్చుతున్నరు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తరు? ఎంత కాలం చేస్తరు? ఇప్పటిదాకా క్షమించినం. కానీ.. బీ కేర్ఫుల్.
మీ చేతగానితనంతోనే గంగానదిలో శవాలు తేలినై
ఎన్ని భయంకర ఫలితాలు మీ పాలనలో! మీ చేతగానితనం వల్ల కొవిడ్ టైమ్లో గంగానదిలో శవాలు తేలినయ్. ఇంకా చాలా ఉన్నయ్. రేపటినుంచి దేశంలో అగ్గిపెడతం. ఇప్పటివరకు మర్యాదగ ప్రవర్తించినం. దేనికైనా ఒక పరిమితి ఉంటది. నేను ఎప్పుడూ మాట్లాడలే. నాకు ఇంత మంట ఎందుకు మండుతుందంటే.. వ్యక్తిగతంగా నన్ను అన్నా మాట్లాడలేదు. రైతాంగం బతుకుతో నేడు చెలగాటం అడుతున్నరు కాబట్టి, వరి వెయ్యాలని బాధ్యతారహితంగా చెప్తున్నరు కాబట్టి, మీ మాట నమ్మి వడ్లు పండిచ్చే రైతులు మునుగుతరు.. వాళ్లను కాపాడుకోవాలి కాబట్టి, ఆవేదనతో చెప్తున్న. కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే రాష్ట్రం వద్దంటుందా? రండి నేను మా వ్యవసాయ మంత్రిని పంపిస్తా. రా డిబేట్కి ఎక్కడికి వస్తవో. ప్రాజక్టులు కట్టి, కరెంటు తెచ్చి, ఇవాళ రైతాంగం కార్లు కొనుక్కొంటున్నరు ఊర్లల్ల. మొకాలు తెల్లబడుతున్నయ్. హైదరాబాద్లో ఉన్నోళ్లు కూడా వాపస్ పోయి ఇండ్లు కట్టుకుంటున్నరు. ఒక దరికివచ్చే తెలంగాణను మీ చిల్లర రాజకీయాల కోసం, మీ కంపు నోరుతోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి చెడగొడ్తవా? మెడలు ఎవరి వంచుతవ్? నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తం జాగ్రత్త.