హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంలో బీసీ కులగణన(Caste census )అంశాన్ని ప్రస్తావించడాన్ని స్వాగ తిస్తున్నామని, కానీ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా కులగణన చేసి చూపించాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఎఫ్) కన్వీనర్ గట్టు రామచందర్ రావు(Gattu Ramachandra Rao), కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యూత్ కన్వీనర్ ఆలకుంట హరి డిమాండ్ చేశారు. గురువారం వారు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. కంటితుడుపు చర్యగా భావించి కులగణనను విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
మాటలు చెప్పి మైమరిపించడం సరికాదని, చేతల్లో చేసి చూపించాలని సూచించారు. కులగణన ఏ విధంగా చేయబోతున్నారు, గడువు ఎంత, విధివిధానాలు ఏమిటి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేవంటే ఎన్నికలు జరగనిచ్చే సమస్యే లేదని తేల్చిచెప్పారు. 2011లో కేంద్రం యూపీఏ ప్రభుత్వం రూ. 4500 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
అలాగే, 2015లో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేశారని, కానీ ఆ తర్వాత 2018లో ఒకసారి, 2023లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పటి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఎండగట్టారు. అలాగే, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దానిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించక తప్పదని తేల్చిచెప్పారు.