హైదరాబాద్, ఫిబ్రవరి 9: (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయ ప్రారంభ వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సచివాలయ ప్రారంభోత్సవానంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందిని సమీకరించాలని సూచించారు.
సచివాలయ ప్రారంభ వేడుకల నిర్వహణపై గురువారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
బహిరంగ సభ జన సమీకరణ కోసం ఈ నెల 13న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని వెల్లడించారు. వాళ్లు ఈ నెల 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని వివరించారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సుధీర్రెడ్డి, ప్రకాశ్గౌడ్, వివేకానందగౌడ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంఎస్ ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.