BJP | ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల కోసమూ విదేశాల వైపు దీనంగా చూసేలా దిగజార్చింది. గోధుమలు, కందులు సహా అనేక ఆహారోత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు తీసుకొచ్చింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనెల ధరలతో కుదేలైన సామాన్యులకు ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, గోధుమ, టమాట, ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని కేంద్రసర్కారు ఒకవైపు ఆహారోత్పత్తుల దిగుమతులకు తలుపులను బార్లా తెరుస్తూనే.. ఎగుమతులపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నది.
ఉల్లి ఎగుమతులపై సుంకం మోత
అనాలోచిత నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలు పాటించే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ముందుచూపు కూడా లేకపోవడంతో దేశంలో నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల కొరత గతంలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకొన్నది. దేశీయ విపణిలో ఉల్లి లభ్యత అంతకంతకూ తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ధరలను నియంత్రించడానికి ఉల్లి ఎగుమతులపై 40 శాతం మేర భారీ సుంకాన్ని కేంద్రప్రభుత్వం విధించింది. ఇక, గోధుమ ధరలను నియంత్రించడానికి రష్యా సాయం తీసుకొంటున్నది. గోధుమలను కొనుగోలు చేయడానికి రష్యా ప్రతినిధులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు కేంద్రమే ప్రకటించింది.
2017 తర్వాత భారత్ గోధుమలను దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. మరోవైపు, గడిచిన రెండు నెలలుగా దేశంలో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. టమాటా ధరలకు కళ్లెం వేయలేకపోయిన కేంద్రం.. చివరకు నేపాల్ను ఆశ్రయించింది. దీంతో భారీ మొత్తంలో టమాటాలను ఆ దేశం భారత్కు సరఫరా చేస్తున్నది. దేశంలో కంది కొరత అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో ధరలను అదుపుచేయడానికి తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్, మయన్మార్ నుంచి టన్నులకొద్దీ కందిపప్పును భారత్ దిగుమతి చేసుకొంటున్నది. ఇక, దేశీయంగా నిల్వలు తగ్గిపోతుండటంతో బియ్యం ఎగుమతులపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించడం తెలిసిందే.
ఆకాశానికి ద్రవ్యోల్బణం
ఆహారోత్పత్తుల ధరాఘాతంతో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి చేరింది, 2022 ఏప్రిల్ (7.79 శాతం) తర్వాత ఇదే గరిష్ఠస్థాయి. ఈ ఏడాది జూన్తో పోలిస్తే జూలైలో కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటా కొండెక్కడమే రిటైల్ ద్రవ్యోల్బణం భారీ పెరుగుదలకు దారితీసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బియ్యం, గోధుమ, నూనెలు దీనికి ఆజ్యం పోసినట్టు పేర్కొంటున్నారు.
గ్యాస్ మంట
నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్ ధర మరో మోయలేని భారంగా తయారవుతున్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా వంటగ్యాస్ సిలిండర్ రేట్లను ప్రభుత్వం తగ్గించట్లేదు. గడిచిన మూడేండ్లలో గ్యాస్ ధరను 20 సార్లు పెంచడమే దీనికి నిదర్శనం. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 2020 ఏప్రిల్ 1న రూ. 714.5 ఉండగా, ప్రస్తుతం రూ.1155కు చేరింది. ఈ మూడేండ్లలో గ్యాస్ ధరను 20 సార్లు సవరించి మొత్తంగా రూ.440.5 పెంచినట్టు కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకొన్న లబ్ధిదారుల్లో కిందటేడాది 1.18 కోట్ల మంది ఒక్క సిలిండర్నూ రీఫిలింగ్ చేయించలేదని వివరించింది. గ్యాస్ రేట్లు అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి కారణం. గ్యాస్ భారాన్ని భరించలేక కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య లక్షల్లోకి చేరింది.
ఆహారోత్పత్తుల దిగుమతులు ఇలా
పేరు : మనకు ఎగుమతి చేస్తున్న దేశం
టమాట : నేపాల్
గోధుమ : రష్యా
కందిపప్పు : మొజాంబిక్, మయన్మార్
వంటనూనె : ఇండోనేషియా
గ్యాస్ రేటు.. పేదలకు పోటు
అవును.. ప్రధాని మోదీ మాటలను మహిళా లోకం గుడ్డిగా నమ్మింది. ఎన్నికల ముందు ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్.. సబ్కా సర్కార్’ అంటే సంబురపడ్డది. మోదీ అధికారంలోకి వస్తే తమ బతుకుల్లో వెలుగులు నింపుతారనుకున్నది. ఇక ఏమీ ఆలోచించకుండా.. ధనాధన్ ఓట్లు గుద్ది గద్దెనెక్కించడానికి తోడ్పడింది. ఇలా దేశంలోని మహిళా లోకం ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన మోదీ.. వంటింట్లో ధరల మంట పెట్టారు. గ్యాస్ రేట్లను అమాంతం పెంచి గృహిణుల కండ్లలో నీళ్లు చూస్తున్నారు. నాడు రూ.400 ఉన్న సిలిండర్ ధరను నేడు రూ.1200లకు పెంచి.. కట్టెల పొయ్యికి దారి చూపించారు. గ్యాస్ పొయ్యిని దూరం చేసి.. వంట చెరుకు కోసం ఆడబిడ్డలను అడవికి పంపుతున్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ కొనలేక.. అష్టకష్టాలు పడి కట్టెలు తెచ్చుకొని.. పాతకాలం కట్టెల పొయ్యే మేలని ఉసూరుమంటున్నారు. అడవి నుంచి నెత్తిన కట్టెల మోపులు తెచ్చుకుంటున్న సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పేదింటి మహిళల దుస్థితే అందుకు నిదర్శనం.
– వర్గల్
‘నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవడమా? మోదీ సర్కారు తీసుకొన్న ఈ మతిలేని నిర్ణయంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతారు. దేశీయ మార్కెట్లు కుదేలవుతాయి’
– స్వాభిమాని శేత్కరీ సంఘటన్ అధ్యక్షుడు, మహారాష్ట్ర రైతునేత రాజు శెట్టి
2014 నుంచి ఇప్పటి వరకూ గ్యాస్ ధరలు
సంవత్సరం : గ్యాస్ ధర (రూ.ల్లో)
2014 : 414
2015 : 606
2016 : 747
2018 : 609
2019 : 695
2020 : 714
2021 : 819
2022 : 1050
2023 : 1155