ఖమ్మం, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ది గ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కి, చీమలపాడులో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్రావుకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కు టుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, అం డగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతోపాటు నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించా రు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తానని ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు. కార్యకర్తల మృతికి సంతాపసూచకంగా జిల్లాలో మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీమలపాడుశివారులో బుధవారం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అప్పటికే ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు ఇతర నాయకులు సభాస్థలికి చేరుకున్నారు. నిర్వాహకులు ఒక్కో ప్రజాప్రతినిధిని వేదిక మీదికి ఆహ్వానిస్తుండగా ప్రాంగణానికి సమీపంలోని ఓ పూరి గుడిసెలో పేలు డు శబ్దం వచ్చింది. పటాకులు గుడిసెలో పడటంతో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. మం టల కారణంగా తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులు హా హాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆజ్మీరా మంగు (38), నరాటి వెంకన్న, స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేశ్ (37), తవిసిబోడుకు చెందిన తేజావత్ భాస్కర్, వెంకిట్యాతండాకు చెందిన ఆంగోత్ కుమార్, గేట్ రేలకాయలపల్లికి చెందిన ధరంసోత్ లక్ష్మణ్(53), హెడ్ కానిస్టేబుల్ నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ కారేపల్లికి చెందిన తేళ్ల శ్రీనివాసరావు, ఇల్లెందు పట్టణానికి చెందిన బండి రా మారావుకు స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే రా ములునాయక్, ఎంపీ నామా, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అప్రమత్తమై కార్యకర్తలు, స్థానికుల సాయంతో క్షతగాత్రులను నాలుగు పోలీస్ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆజ్మీరా మంగు, బానోత్ రమేశ్, ధరంసోత్ లక్ష్మణ్ మృతిచెందారు. ప్రమాదంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చీమలపాడు అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుతోపాటు కలెక్టర్ వీపీ గౌతమ్, ఇతర జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఖమ్మం జిల్లా పార్టీ నాయకత్వానికి సూచించారు.