కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో సాగుతున్న ఉచిత భోజన పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పేదలకు భోజనాలు అందించాలన్న ఆలోచన ఎంతో గొప్పదన్నారు. ముఖ్యంగా నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు, దవాఖానల్లో ఉన్న రోగుల బంధువులు, హమాలీలు ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లాక్డౌన్ ముగిసేవరకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై.సునీల్రావు, కార్పొరేటర్లు రాజేందర్రావు, శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.