హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గన్నీ సంచులకు, నిధులకు ఎలాంటి ఇబ్బందీ లేదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.07 లక్షల మంది రైతుల వద్దనుంచి రూ.8వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు.
మరో పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉన్నదన్నారు. 2,257 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, వాటిని మూసివేశామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 7.11 లక్షల టన్నుల ధాన్యం ఉన్నదని, కోతలు పూర్తికావలసిన జిల్లాల్లో ఇంకా 4.32 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన చివరి గింజ వరకూ కొనాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సేకరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం రోజుకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామని.. మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో వడ్ల కొనుగోళ్లు ముగుస్తాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రైతుల కోసం రూ.3వేల కోట్ల నష్టాన్ని భరించి..
ఈ యాసంగి మొదటి నుంచీ కేంద్రప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కక్ష పూరితంగా వ్యవహరించి భయాందోళనలకు గురిచేసిందని మంత్రి గంగుల విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రైతులను గందరగోళపర్చేలా ప్రకటనలు చేశాయని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించాయని ఆయన మండిపడ్డారు. కేంద్రం చేతులెత్తేసినా… ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రం మోకాలడ్డుతున్నా దాదాపు రూ. 3వేల కోట్ల నష్టాన్ని భరించి రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా కమిషనర్ కార్యాలయంలో వార్ రూం ఏర్పాటు చేసి మిల్లర్లు, ట్రాన్స్పోర్టు, కొనుగోలు కేంద్రాలు, హమాలీలను అనుసంధానం చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా జరుపుతున్నట్లు తెలిపారు.
స్టోరేజీ, గన్నీల సమస్యకు చెక్..
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకుగాను ఎక్కడా స్టోరేజీ సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్, జగిత్యాల, మెదక్ వంటి అధిక ధాన్యం ఉత్పత్తి అయిన ప్రాంతాల నుంచి మిల్లింగ్ కోసం అధిక కెపాసిటీ గల పెద్దపల్లి, కరీంనగర్, వనపర్తి, వరంగల్, జోగులాంబ జిల్లాలకు 2.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించామని వివరించారు. గోడౌన్లు సైతం అందుబాటులో ఉన్నాయని, కొరత ఉన్న మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఇంటర్మీడియట్ స్టోరేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 13కోట్ల 69 లక్షల గన్నీ బ్యాగులు సేకరించామని.. 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోయేలా 3కోట్ల 37 లక్షల గన్నీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.