హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా, సజావుగా కొనసాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిరుడు ఇదే సమయంలో సేకరించిన ధాన్యం కంటే ఇది దాదాపు 8 లక్షల టన్నులు అధికమని వివరించారు. ఇప్పటివరకు రూ.2,390 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా రూ.2,154 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వెల్లడించారు. వరి కోతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో 6,129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తవ్వడంతో వాటిని మూసివేశామని పేర్కొన్నారు.