హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో రూ.వేలకోట్ల విలువైన స్థలాలను బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీసీ సంఘాల నేతలతో కలిసి మంగళవారం కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ సముదాయంలో పర్యటించిన మంత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకాపేట, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని వెల్లడించారు. 87.3 ఎకరాల్లో రూ.95.25 కోట్లతో ఆయా భవన నిర్మాణాలు చేపట్టినట్టు వివరించారు.
యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మున్నూరుకాపు, ముదిరాజ్, గౌడ, బసవేశ్వర భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. మిగతా భవనాల నిర్మాణాలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం ఐదెకరాల్లో రూ.5 కోట్ల తో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం డిజైన్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, నేత హరిశంకర్, బీసీ సంక్షేమ శాఖ జేడీ చంద్రశేఖర్, డీడీలు సంధ్య, విమలాదేవి, వాటర్ వర్ డీఈ నరహరి, విద్యుత్తు శాఖ ఎస్ఈ వెంకన్న, కోకాపేట తహసీల్దార్ రాజశేఖర్రెడ్డి, హెచ్ఎండీఏ అధికారి ప్రవీణ్ పాల్గొన్నారు.