మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మూసాపేట, డిసెంబర్ 19: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అమానుషం జరిగింది. కాంగ్రెస్ విజయోత్సవాల్లో పాల్గొంటున్న తన తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు అటువైపు వెళ్లిన దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తీవ్ర రక్తస్రావమైన ఆ యువతిని జిల్లా దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్లో ఎక్కిస్తుండగానే ప్రాణం కోల్పోయింది. దీంతో గ్రామస్తులు, దళిత సంఘాల నేతలు కోపోద్రిక్తులయ్యారు. నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు, దళిత సంఘాల నేతలు చెప్తున్న వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి రవిరాజాచారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నాయకులు జులూస్ తీశారు. డీజే పెట్టి మద్యం తాగి, డ్యాన్స్లు చేశారు. ర్యాలీలో పాల్గొన్న తన తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో దళిత యువతి (22) అక్కడికి వెళ్లింది. అదే జులూస్లో పాల్గొన్న సంగ విష్ణు.. సదరు దళిత యువతిని సమీపంలో ఉన్న రైతు వేదిక వద్దకు తీసుకెళ్లినట్టు తెలిసింది.
తర్వాత 8:30 గంటల సమయంలో డీజే చప్పుడుకు ఆ యువతి స్పృహతప్పి పడిపోయిందంటూ సదరు యువకుడు జులూస్లో ఉన్న మరో మహిళకు తెలియజేయడంతో ఆమె కూడా అక్కడికి చేరుకున్నది. ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వారిద్దరూ కలిసి ఆ యువతిని బైక్పై గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లినట్టు తెలిసింది. తర్వాత ‘మీ కూతురు ఆర్ఎంపీ క్లినిక్ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నది’ అంటూ యువతి తండ్రికి తెలియజేయడంతో భార్య, కొడుకుతో కలిసి ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే ఆటోలో జానంపేట పీహెచ్సీకి తరలించారు. అక్కడి సిబ్బంది పరిశీలించి పల్స్ పడిపోయిందని, మహబూబ్నగర్కు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో యువతిని ఎక్కిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబసభ్యులు రాత్రి 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను కాపాడే ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో గ్రామస్తులంతా పాల్గొని డ్యాన్స్లు చేస్తున్న సమయంలో ఆ దళిత యువతిని అక్కడే ఉన్న విష్ణు.. రైతువేదిక వద్దకు తీసుకెళ్లగా, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించి సామూహిక లైంగికదాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. దవాఖాన ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు రూ.30 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
యువతి గ్రామంలో ఉద్రిక్తత
దళిత యువతిపై లైంగికదాడి, హత్య ఘటనపై మూసాపేట మండలంలోని గ్రామంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొన్నది. విష్ణుతోపాటు మరికొందరికి ఈ దారుణంతో సంబంధం ఉన్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విష్ణుపై మాత్రమే కేసు నమోదు చేసి.. మిగతా వారిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా యువతి మృతదేహాన్ని గ్రామానికి తీసుకునిరాగా.. అంబులెన్స్లో నుంచి మృతదేహాన్ని కిందకు దించకుండా దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు కొద్దిసేపు అడ్డుకున్నారు. నిందితులను శిక్షించిన తర్వాతే అంత్యక్రియలు జరిపిస్తామని గ్రామస్తులు స్పష్టంచేయడంతో, భూత్పూర్ సీఐ రామకృష్ణ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయేందిర కూడా గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు.
హత్య ఘటనపై నిజనిర్ధారణ
దళిత యువతిపై లైంగికదాడి, హత్య జరిపిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆది రవీంద్రబాబు, బాలయ్య, కే లక్ష్మణ్, మోహన్లాల్, పరశురాం తదితరులు గ్రామంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు విష్ణుతోపాటు అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని చూస్తే విష్ణు మాత్రమే కాకుండా మరికొందరు ఆమె చావుకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. పోలీసులు విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా.. దోషులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే ఆల పరామర్శ
దళిత యువతిపై లైంగిక దాడి, మృతి ఘటన గురించి సమాచారం అందుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చూడగానే.. ‘అన్నా.. ఘోరం జరిగిపోయింది.. మా అమ్మాయిని చంపేశారు..’ అంటూ మృతురాలి కుటుంబసభ్యులు బోరున విలపించారు. చలించిAla Venkateswar Reddyపోయిన ఆల వెంకటేశ్వర్రెడ్డి వెంటనే.. సీఐకి ఫోన్ చేసి, నిందితులెవరినీ వదలకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం రాత్రి గ్రామస్తులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.