కిరాయి హంతకులకు రూ.15 కోట్లు సుపారీ ఇచ్చేందుకు డీల్
మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
ఢిల్లీలో మాజీ ఎంపీ సర్వెంట్ క్వార్టర్స్లో నిందితుల మకాం
8 మంది అరెస్టు, రెండు తుపాకులు, 8 బుల్లెట్లు స్వాధీనం
ప్రధాన సూత్రధారి పాలమూరుకు చెందిన రాఘవేంద్రరాజు
కుట్ర వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
అతనొక బీసీ నాయకుడు.. స్వశక్తితో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో మడమ తిప్పని పోరాటం చేశారు. ఉద్యోగులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, నడిపించారు. అటువంటి బడుగు, బలహీన వర్గాల నేత హత్యకు కుట్ర జరిగింది. కొద్దిరోజుల క్రితం అందిన సమాచారంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. అసలీ కుట్రకు కారణమేంటి? కారకులెవరు?
హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న విషయం తేటతెల్లమైంది. సైబరాబాద్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. ఈ హత్యకు రూ.15 కోట్ల సుపారీ అందిందని చెప్పిన పోలీసులు.. హత్యకు కుట్రపన్నిన 8 మందిని బుధవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘మహబూబ్నగర్కు చెందిన ఫారూక్, హైదర్అలీ ఫిబ్రవరి 25న హైదరాబాద్లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో ఉన్నారు. 27న టీ తాగడానికి బయటికి రాగా, వీరిద్దరిని హతమార్చేందుకు నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య మారణాయుధాలతో వెంబడించారు. తప్పించుకొన్న హైదర్అలీ, ఫారూక్.. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 26న ఫారూక్, హైదర్అలీ కోసం మిగతా లాడ్జిల్లో నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య వెతుకుతుండగా వాళ్లను అరెస్టు చేశాం. 27న కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు పంపాం. ఆ దర్యాప్తులో మాకు ఓ హత్యకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.
దీంతో నాగరాజును విచారించగా అతడు, మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు, మరికొందరితో కలిసి ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. కొన్ని ఆధారాలు సేకరించగా రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్రాజు ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో వీరి లొకేషన్ చూడగా ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నట్టు స్పష్టమైంది. రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూరు రవిని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చాం. వారిని విచారించగా ఈ ముగ్గురితో పాటు అమరేందర్రాజు కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు రూ.15 కోట్ల సుపారీ డీల్ మాట్లాడుకొన్నట్టు తెలిసింది. నాగరాజు అరెస్టు విషయం తెలియగానే.. రాఘవేంద్రరాజు, మధుసుదన్రాజు, అమరేందర్రాజు, మున్నూరు రవి మహబూబ్నగర్ నుంచి వైజాగ్, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు.
అక్కడ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ తాపా సహాయంతో సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నారు. వారిని అరెస్టు చేసి తీసుకొచ్చామని, అరెస్టయిన రాఘవేంద్రరాజు, మున్నూరు రవి నుంచి 9ఎంఎం తుపాకి, రెండు బుల్లెట్లు, 6 రౌండ్లతో కూడిన రివాల్వర్ను స్వాధీనం చేసుకొన్నామని సీపీ వివరించారు. సాంకేతికంగా, శాస్త్రీయంగా ప్రాథమిక ఆధారాలు సేకరించగా మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర తేటతెల్లమైందని తెలిపారు. ఈ కుట్రతో సంబంధం ఉన్న 8 మంది.. రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూర్ రవి, అమరేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, తాపాను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసే సమయంలో ఢిల్లీ పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.
హత్యకు సుపారీ నగదు ఫైనాన్సియర్ నుంచే
‘మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు రూ.15 కోట్ల సుపారీ నిధులు ఫైనాన్సియర్లు అమరేందర్రాజు, మధుసూదన్రాజు ఇవ్వడానికి ముందుకు వచ్చారని రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు. అయితే మంత్రి శ్రీనివాస్గౌడ్, రాఘవేంద్రరాజుకు విబేధాలు ఉన్నాయి. ఆ విబేధాలు దేనికి సంబంధించినవో తేలాల్సి ఉన్నది. హత్య కోసం రాఘవేంద్రరాజు ఉత్తర్ప్రదేశ్ నుంచి తుపాకులు సమకూర్చుకొన్నట్టు ఆధారాలు లభించాయి’ అని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
జితేందర్రెడ్డి, డీకే అరుణ అనుచరుల పాత్రపై ఆరా
ఈ కుట్రలో జితేందర్రెడ్డి, డీకే అరుణ పాత్ర ఉన్నదా అని మీడియా ప్రశ్నించగా.. ‘మంత్రి హత్య కుట్ర కేసులో వెలుగులోకి వస్తున్న ప్రతి ఒకరి పాత్రపై ఆరా తీస్తాం. పూర్తి ఆధారాలను సేకరిస్తాం. దర్యాప్తులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పాత్ర ఉన్నట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకొంటాం. బీజేపీ మహిళానేత డీకే అరుణ మనుషులు కూడా ఇందులో ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కూడా పూర్తి విచారణ చేపడతాం’ అని సీపీ స్పష్టం చేశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. మరోసారి ఈ 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొని హత్యకు కుట్ర, రెక్కీ, రూ.15 కోట్ల నగదుకు సంబంధించిన వివరాలను సేకరించి మీడియా ముందు పెడతామని తెలిపారు. ఈ సమావేశంలో బాలానగర్ డీసీపీ సందీప్ పాల్గొన్నారు.
రాఘవేంద్రరాజు వాంగ్మూలంలో హత్య కుట్ర వెలుగులోకి
‘రాఘవేంద్రరాజును విచారించినప్పుడు.. క్యాబినెట్ మినిస్టర్ శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు కుట్రపన్నామని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించాడు. దీనికోసం రాఘవేంద్రరాజు ముందుగా నేరచరిత్ర ఉన్న ఫారూక్ను సంప్రదించి.. ‘మినిస్టర్ను హత్య చేయాలి. నువ్వన్నా చెయ్యు లేదా ఎవరైనా కిరాయి హంతకులు ఉంటే చెప్పాలని అడిగినట్టు వెల్లడించాడు. మంత్రిని హతమారిస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నట్టు రాఘవేంద్రరాజు వివరించాడు’ అని సీపీ తెలిపారు.