హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల గుట్టు బయటపడుతున్నది. లీక్ చేసిన గ్రూప్-1 పేపర్ను అందుకున్నట్టుగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తిని మంగళవారం సిట్ అదుపులోకి తీసుకొన్నది. నిందితులను 4వ రోజు కస్టడీలో విచారించి, వారిని స్వస్థలాలకు తీసికెళ్లి వారి ఇండ్లలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల విభాగం కస్టోడియన్ శంకరలక్ష్మిని మంగళవారం సిట్ మరోమారు విచారించింది. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్-1 రాసినవారిలో 10 మంది మెయిన్స్కు అధిక మార్కులతో అర్హత సాధించినట్టు సిట్ గుర్తించింది. ఇందులో ముగ్గురు ఔట్సోర్సింగ్, మిగతా ఏడుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించింది. వారికి నోటీసులు జారీ చేసింది. మెయిన్స్కు అర్హత సాధించిన పది మంది ఉద్యోగులకు అన్ని మార్కులు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. ప్రవీణ్, రాజశేఖర్తో వారికి మంచి సంబంధాలుండటంతో ప్రశ్నపత్రం వారికి కూడా అంది ఉంటుందనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పేపర్ లీకైన విషయం టీఎస్పీఎస్సీలోని 10 మంది ఉద్యోగులకు తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎంత మందికి అందాయి?
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి సెల్ఫోన్ డాటాను పోలీసులు విశ్లేషిస్తూ వాటి ఆధారంగా ప్రశ్నపత్రాలు ఎంతమందికి అందాయని ఆరా తీస్తున్నారు. ప్రవీణ్కు సురేశ్ అనే వ్యక్తితో మంచి సంబంధాలున్నట్టు తేల్చారు. ప్రవీణ్ ద్వారా సురేశ్కు గ్రూప్-1 ప్రశ్నపత్రం అందినట్టు కొన్ని ఆధారాలు లభించడంతో సురేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల కస్టడీలో ప్రవీణ్ను, అనుమానితుడైన సురేశ్ను ఫేస్ టు ఫేస్ విచారించారు. సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ ఫోన్కాల్, వాట్సాప్ డాటాను పోలీసులు విశ్లేషించారు. రాజశేఖర్ స్వగ్రామంలోనూ ఆరా తీశారు.
కానిస్టేబుల్ పాత్రపై ఆరా..
నిందితుల్లో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఇతడే రేణుక సోదరుడికి నీలేశ్నాయక్, గోపాల్నాయక్లను పరిచయం చేశాడు. వీళ్లిద్దరు రూ.13.5 లక్షలు ఏఈ ప్రశ్నపత్రం కోసం ఇచ్చారు. ఇందులో లక్ష రూపాయలు శ్రీనివాస్ కూడా ఆర్థికంగా వారికి సహకరించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పోలీసులు కానిస్టేబుల్ పాత్రపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
నిందితుల ఇండ్లలో సోదాలు?
నిందితుల ఇండ్లలోనూ మంగళవారం సిట్ తనిఖీలు చేసినట్టు తెలిసింది. సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ స్వస్థలం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామంలో సిట్ విచారణ జరిపినట్టు సమాచారం. అతని ఇంట్లో కూడా తనిఖీలు చేసినట్టు తెలిసింది. రాజశేఖర్, సన్నిహితులు, బంధువుల వివరాలను సేకరించినట్టు సమాచారం. రేణుక, ఢాక్య దంపతులకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా గుండేడ్ మండలంలోని పంచాంగల్తండాలోని ఇంట్లో సోదాలు చేసి, పేపర్ను కొనుగోలు చేసి ఇద్దరిని చదివించిన ఇంటిని కూడా పోలీసులు సోదా చేసినట్టు తెలిసింది. మరో నిందితుడు నీలేశ్ ఇంట్లో సోదాలు జరిపినట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా పులిచర్లకుంట తండాకు చెందిన గోపాల్నాయక్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నిందితులను అక్కడికి తీసుకెళ్లినట్టు సమాచారం.