వినాయక్ నగర్ ( నిజామాబాద్ ) : తొమ్మిది రోజుల పాటు కొలువుదీరి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో నిమజ్జనం కోలహాలంగా కొనసాగింది.జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన (Ganesh Immersion ) శోభాయాత్ర రెండవ రోజు ఆదివారం వరకు కొనసాగింది.
గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం సైతం నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర గోదావరి నదికి తరలి వెళ్లాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర( Basar ), ఉమ్మెడ ( Ummeda ) వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిబ్బంది పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
నిమజ్జనం జరిగే ప్రదేశాలను సీపీ స్వయంగా పర్యవేక్షించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి.ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. సీపీ వెంట నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, సీఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొన్నారు.