Ganesh Immersion | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’… అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,10,000లకు పైగా విగ్రహాలకు నిర్వాహకులు రిజిస్టర్ చేసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో విగ్రహానికి ముగ్గురి నుంచి ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అవసరం మేరకు వివిధ జిల్లాల్లో విధులు కేటాయించగా, వారు నిజమజ్జనం వరకు నిర్ణీత ప్రాంతంలో విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది నిమజ్జన బందోబస్తులో మోహరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఒక్క హైదరాబాద్లోనే సుమారు 40 వేల మంది పోలీసులు నిమజ్జన బందోబస్తులో పాల్గొన్నారని చెప్పారు. గురువారం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలను పోలీసుశాఖ నిరంతరం పర్యవేక్షించింది. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్, హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కమాం డ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీలో అగ్నిమాపకశాఖ 102 ప్రాం తాల్లో అగ్నిమాపక వాహనాలను మోహరించింది. మహిళా పోలీసులకు ప్రత్యేక వసతులు కల్పించారు.