నిర్మల్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్మల్లో రేపు జరిగే వినాయకుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో గణేష్ ప్రతిమలు వెళ్లే మార్గంలో మంత్రి పర్యటించారు.
పట్టణంలోని నగరేశ్వర వాడ చౌరస్తా నుంచి ధ్యాగవాడ, గుల్జార్ మార్కెట్, గాంధీ చౌక్, నాయుడివాడ, బంగల్ పేట్ వినాయక సాగర్ వరకు బైక్ పై తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. బంగల్ పేట్, బుధవార్ పేట్, రథాల గుడి, బ్రాహ్మణ సంఘం గణనాథులను దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనానికి భక్తులు, యువకులు పోలీసులకు సహకరించాలని తెలిపారు. రేపు ఉదయం బుధవార్ పేట్ ఒకటో నంబర్ గణపతి వద్ద కొబ్బరికాయ కొట్టి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభిస్తామని అన్నారు. గణేష్ నవరాత్రులు అందరి పండుగ అని, ఎలాటి రాజకీయాలకు తావులేకుండా అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన సూచించారు.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రోడ్డు, లైట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు వెడల్పు ద్వారా ఇప్పటి నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని త్వరలోనే బీటీ రోడ్డు పూర్తి చేస్తామని తెలిపారు.
గాంధీ చౌక్ లో నూతన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. ఈ సారి నిర్మల్ లో 30 వేల విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.