రేగొండ, మే 3 : రైతులు పండించిన మక్కలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి రేగొండలోని పరకాల- భూపాలపల్లి ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రజలు తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తే, వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని విమర్శించారు. ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు.