హైదరాబాద్: టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) కారెక్కనున్నారు. నేడు నర్సాపూర్లో (Narsapur) నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. నర్సాపూర్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గాలి అనిల్ కుమార్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి (Congress) రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనతో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) భేటీ అయ్యారు. గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్ రావు.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరేందుకు అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల తీరుతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నానని అనిల్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దీనస్థితిలో ఉన్న సమయంలో ఆ పార్టీ జెండాను మోసినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఖర్చుకు వెనుకాడలేదన్నారు. ఇప్పుడు టికెట్ ఇచ్చే సమయంలో పార్టీ రాష్ట్ర నేతలు వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. పార్టీ కోసం 24 గంటలు కష్టపడిన వారిని కాదని టికెట్ కావాలని అప్లికేషన్ కూడా పెట్టని వారికి టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు. అప్లికేషన్ పెట్టని 40మందికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు న్యాయంగా 34 సీట్లు ఇస్తామని మొండిచెయ్యి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో కష్టపడిన వారికి న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవమర్యాదలు, ప్రాధాన్యతలు దక్కడం లేదన్నారు. తాను పార్టీ కోసం పనిచేసి అన్ని విధాలుగా నష్టపోయినట్టుగా తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్యానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.