గజ్వేల్, డిసెంబర్ 9: గజ్వేల్ సమీకృత మార్కెట్కు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ అధికారులు గజ్వేల్ సమీకృత మార్కెట్కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అమెరికా తరహాలో కూరగాయలు, మాంసం, పూలు, పండ్లు ఇలా అన్నీ ఒకే ప్రాంగణంలో లభించే రీతిలో సీఎం కేసీఆర్ ఈ సమీకృత మార్కెట్ను 6.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.22.85 కోట్ల వ్యయంతో నిర్మించారు.
స్వచ్ఛమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాల నడుమ నాణ్యమైన, శుభ్రమైన కూరగాయలు, మాంసం, పండ్లు, పువ్వులు విక్రయించడాన్ని పరిశీలించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉన్నతాధికారులు ఇక్కడి వ్యాపారులకు మరింత శిక్షణ ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత వ్యాపారులు చేస్తున్న విక్రయాలను, సమీకృత మార్కెట్ నిర్వహణను పరిశీలించి.. సమీకృత మార్కెట్తోపాటు అందులో ని వ్యాపారులకు కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. ఇప్పటికే ఈ మార్కెట్ను ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చూసి సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దేశంలోఎఫ్ఎస్ఎస్ఏఐ ధ్రు వీకరణ పొందిన మార్కెట్గా గజ్వేల్ మార్కెట్ ప్రశంసలు అందుకోవడంపై పట్టణ ప్రజలు సం తోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్కెట్ను సీఎం కేసీఆర్ 2019 డిసెంబర్ 11న ప్రారంభించగా, వ్యాపారుల కోసం మొత్తం ఆరు విభాగాలలో 242 స్టాళ్లను నిర్మించారు. ఆరింటిలో 3 బ్లాకులను కూరగాయల కోసం, 2 బ్లాకులు పూలు, పండ్ల కోసం, ఒక బ్లాక్ను మటన్, చికెన్, చేపల విక్రయాలకు కేటాయించారు. అదీగాక మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ, క్లాక్ టవర్, మినరల్ వాటర్ సదుపాయం, భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు, ఆహ్లాదాన్ని పంచే చెట్లు, పార్కులు, ఆటవస్తువులు, రైతు జీవనం, సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే రకరకాల శిల్పాలు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా ఉండటంతోపాటు నిర్వహణ సరిగ్గా చేపడుతుండటంతో గుర్తింపు వచ్చింది.