CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఎంపీ టికెట్ల పంపిణీలో తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళనబాట పట్టిన మాదిగ నేతలను ఆ పార్టీ మరోసారి బురిడీ కొట్టించింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో దాదాపు 70 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆదివారం తనను కలిసి ఆ సామాజికవర్గం నేతలకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, రాజ్యసభలో మరో రెండేండ్ల వరకు, శాసనమండలిలో మరో ఏడాది వరకు ఖాళీలు ఏర్పడే అవకాశమే లేదని, అలాంటప్పుడు ఆ పదవులు ఎలా ఇస్తారని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల విషయంలో బురిడీ కొట్టించిన విధంగానే కొత్తగా ఆశ చూపుతున్న పదవుల విషయంలోనూ హ్యాండిచ్చే అవకాశం ఉన్నదని, కాబట్టి ఉత్తుత్తి హామీలను నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడుస్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ (అనిల్కుమార్యాదవ్, రేణుకాచౌదరి), ఒకటి (వద్దిరాజు రవిచంద్ర) బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. మరో రెండేండ్ల వరకు రాజ్యసభలో ఖాళీలు ఏర్పాడే అవకాశం లేదు. ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, కే కేశవరావు పదవీ కాలం 2026 ఏప్రిల్ 9తో ముగియనున్నది. మరో ఇద్దరు సభ్యులు పార్థసారథిరెడ్డి, దామోదర్రావు పదవీ కాలం 2028 జూన్ 21 వరకు ఉన్నది. కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యుల (వద్దిరాజు రవిచంద్ర, అనిల్కుమార్, రేణుకాచౌదరి) పదవీకాలం 2030 ఫిబ్రవరి 19 వరకు కొనసాగుతుంది. అలాంటప్పుడు మాదిగ నేతలకు రాజ్యసభ పదవులు ఇప్పట్లో ఇవ్వడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రెండేండ్ల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ పదవిలో ఉంటారో, అసలు రేవంత్రెడ్డి అప్పటికి పదవిలో ఉంటారన్న గ్యారెంటీ ఏమున్నదని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీల (శేరి సుభాష్రెడ్డి, సత్యవతిరాథోడ్, యెగ్గే మల్లేశం, మహమూద్ అలీ, మీర్జా రియాజ్హసన్) పదవీకాలం 2025 మార్చి 29తో ముగియనున్నది. అంటే దాదాపు మరో ఏడాది వరకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం లేదు. ఇక ఉపాధ్యాయ కోటాలో కానీ, గవర్నర్ కోటాలో కానీ ఎమ్మెల్సీల పదవులు పొందడానికి అవకాశమే లేదు. స్థానికసంస్థల కోటాలో ఎంఎస్ ప్రభాకర్ (హైదరాబాద్) పదవీ కాలం 2025 ఆగస్టు 6న ముగియనున్నది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఓటరే అయి ఉండాలనే నిబంధన ఉన్నది.
మాదిగ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, ఊట్ల వరప్రసాద్ ఆదివారం పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మాదిగ వర్గానికి చెందిన నాయకులకు పదవుల్లో సముచిత గౌరవం కల్పిస్తామని, రాజ్యసభ, శాసనమండలితోపాటు నామినేటెడ్ పోస్ట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆ ముగ్గురు నేతలు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణకు అనుకూలంగా బిల్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రేవంత్రెడ్డిపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషిచేస్తామని ప్రకటించారు. బీజేపీ నుంచే దళితులకు పెద్ద ముప్పు ఉన్నదని హెచ్చరించారు.