హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది. గద్దర్ పార్ధివదేహాన్ని అల్వాల్లోని ఆయన నివాసం వద్ద కొద్దిసమయం ఉంచిన తర్వాత.. ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయం ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతిమ యాత్రలో భాగంగా గన్పార్క్, అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు నిలపివేయనున్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు. గద్దర్ భౌతికకాయాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ కోమటిరెడ్డి తదితర నేతలు గద్దర్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదర్చారు.