హైదరాబాద్, డిసెంబర్ 5, (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. హైదరాబాద్ శివారు దేవరయాంజాల్లోని వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. రోశయ్య పార్ధివదేహం ఉన్న బాక్సుపై మేడ్చల్ కలెక్టర్ హరీశ్ జాతీయ జెండాను కప్పి వందనం సమర్పించగా, పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పు అంటించారు. అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు హాజరై, కడపటి వీడ్కోలు పలికారు. అంతకుముందు రోశయ్య భౌతికకాయాన్ని కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్లో ఉంచారు. అక్కడి నుంచి మొదలైన అంతిమ యాత్ర మధ్యా హ్నం 1.15 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నది. కొంపల్లి నుంచి అంత్యక్రియలు జరిగిన వ్యవసాయ క్షేత్రం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, గణేశ్గుప్తా, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్రెడ్డి, కేవీపీ రాంచందర్రావు, రాష్ట్ర మాజీ మంత్రులు గీతారెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, వీ హన్మంతరావు, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, సినీ నటుడు చిరంజీవి తదితరులు అమీర్పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు.