వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు
లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి
పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి
నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే
ఊసేలేని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. కొత్త ప్రాజెక్టుల మాట లేనే లేదు. కనీసం కొనసాగుతున్న ప్రాజెక్టులకైనా నిధులు ఇచ్చారా అంటే.. వేల కోట్ల ప్రాజెక్టులకు ఇచ్చింది వెయ్యి రూపాయలు.. లక్ష రూపాయలు! రైల్వేల విషయంలో కేంద్రం పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లైన్, నల్లగొండ-మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకు కేంద్రం ఉదారంగా ఇచ్చిన మొత్తం ఒక్కోదానికి వెయ్యి రూపాయలు. ఏదైనా కొంటే ముందుగా బయానా ఇచ్చినట్లు ఇచ్చారని తెలంగాణ ప్రజలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కావాలనే రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు అరకొరగా నిధులు కేటాయించారని వారంటున్నారు. ఈ కేటాయింపులు చూస్తుంటే అసలు ఆయా లైన్లకు నిధులు కేటాయించినట్లా లేదా? అన్నది అర్థం కాని పరిస్థితి ఎదురవుతున్నది. తుతూ మంత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకొన్నది. 11 రకాల పెండింగ్ ప్రాజెక్టులు మోక్షం కల్పించాలని సికింద్రాబాద్లోని రైల్వే నిలయం వద్ద టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీల నాయకులు మహాధర్నా చేసినప్పటికీ కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదు. తెలంగాణ ప్రతిపాదనలు చెవులకు ఎక్కించుకోలేదు. పెండింగ్ లైన్లకు మాత్రం నామమాత్రంగా నిధులు ప్రతిపాదించడం దారుణం.
నల్లగొండ- మాచర్ల మధ్య కొత్త రైల్వే లైను ప్రతిపాదించినప్పటికీ దీనికి కూడా వెయ్యిరూపాయలు కేటాయించారు. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొత్త రైల్వే లైనుకు మరి దారుణంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. భద్రాచలం రోడ్-సత్తుపల్లి మధ్య 56.25 కిలోమీటర్ల మేర రోడ్డుకు రూ.162.51 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే మణుగూరు-రామగుండం, కొండపల్లి-కొత్తగూడెం మధ్య కొత్త లైన్లను ప్రతిపాదించినప్పటికీ వాటికి రూ.1000 మాత్రమే నిధులిచ్చారు.
రాష్ట్రంలో పలు రైల్వే మార్గాలలో మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు ఈసారి నిధులు కేటాయించారు. ఇది కూడా ప్రయాణికుల సౌకర్యం కోసం కాదు. కేవలం సిమెంట్ ఫ్యాక్టరీలు, సరుకు రవాణా వంటి వాటికోసమే మూడో లైన్ల నిర్మాణాలను బడ్జెట్లో ప్రతిపాదించారు. మందమర్రి- రాఘవాపురం మధ్య మూడో రైల్వేలైను ప్రతిపాదన ఇప్పటికే ఉన్నప్పటికీ నిధులు మాత్రం ఇవ్వలేదు. అలాగే కాజీపేట-భద్రాచలం రోడ్ మధ్య 201.40 కిలోమీటర్ల మేర మూడో లైన్కు రూ.346 కోట్లు ప్రతిపాదించారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య 85.24 కిలోమీటర్ల డబ్లింగ్ కోసం రూ.50 కోట్లు, చర్లపల్లి దగ్గర శాటిలైట్ టెర్మినల్ కోసం రూ.69 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. దీనిపైనా కేంద్రం నిర్లక్ష్యం వహించింది.
రాష్ట్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ల నిర్మాణాలకు కూడా నామమాత్రంగా నిధులిచ్చారు. నష్కల్-ఘన్పూర్ క్రాసింగ్ సెంటర్ 49 దగ్గర ఆర్వోబీకి రూ.2 కోట్లు, సఫాయిగూడ ఆర్యూబీకి రూ.లక్ష ఇచ్చారు. సికింద్రాబాద్-కాజీపేట్ 15వ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ కోసం రూ.25 కోట్లు కేటాయించారు. ఖమ్మం-పందిళ్లపల్లి క్రాసింగ్ నంబర్ 106 వద్ద ఆర్వోబీకి రూ.4 కోట్లు, దేవరకద్ర-కౌకుంట్ల ఆర్వోబీకి రూ.కోటి, అమ్ముగూడ-మౌలాలి ఆర్వోబీకి దారుణంగా రూ.10 లక్షలు, చర్లపల్లి-ఘట్కేసర్ ఆర్వోబీకి మరో పది లక్షలిచ్చారు. రాయగిరి-వంగపల్లి ఆర్వోబీ కోసం రూ.లక్ష ఇచ్చారు. రవీంద్రఖని-మంచిర్యాల మధ్య రూ.5 కోట్లు, లాలాగూడ ఆర్వోబికీ రూ.1 లక్ష, సికింద్రాబాద్-కాజీపేట్ మధ్య క్రాసింగ్ సెంటర్ 54 దగ్గర అండర్ బ్రిడ్జి కోసం రూ.10 లక్షలు, కాజీపేట-విజయవాడ మార్గంలో.. క్రాసింగ్ వద్ద రూ.1 లక్ష, కాజీపేట-విజయవాడ క్రాసింగ్ నంబర్ 80 వద్ద ఉన్న ఆర్వోబీ కోసం రూ.10 లక్షలు .. సికింద్రాబాద్-డోన్ మధ్య సబ్వేల కోసం రూ.10 లక్షలు ఇలా చెప్పుకొంటూ పోతే.. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లు, కొత్త రైల్వే లైన్లకు మొక్కుబడిగా చిల్లర విదిల్చింది. అంతే కాదు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కొన్ని మరమ్మతుల కోసం రూ.5 కోట్లు, ఎస్సీఆర్ రైల్వే పరిధిలో ట్రాక్ మరమ్మతుల కోసం ఈ సారి రూ.1200 కోట్లు కేటాయించారు. తెలంగాణకు చెప్పుకోదగ్గ నిధులు ఏవైనా ఉన్నాయా అంటే ఇదొక్కటే. రాష్ట్రంలో 11 పెండింగ్ రైల్వే లైన్లతోపాటు 25 రకాల కొత్త ప్రాతిపాదిత రైల్వే లైన్ల నిర్మాణాలపై కేంద్రం ఎలాంటి మాట మాట్లాడలేదు.
రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పేరుతో కేంద్రం దగా చేసింది. నిధుల కేటాయింపులో నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉన్నది. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మధ్య 177.49 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్లను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనికిగాను మొత్తంగా రూ.1,020 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్న కేంద్రం.. ప్రతిపాదిత కేటాయింపుల్లో రూ.1000 మాత్రమే ఇవ్వడం దుర్మార్గం కాక మరేమిటి? మునీరాబాద్-మహబూబ్నగర్ మధ్య రూ.1400 కోట్లతో గతంలోనే నిధులు ప్రతిపాదించగా.. ఈ బడ్జెట్లో మాత్రం రూ.289 కోట్లు ప్రతిపాదించి సరిపెట్టేశారు.