కరెంట్ కోతలు, పవర్ హాలిడేలు, లే ఆఫ్లు, పరిశ్రమల మూత, పనులు దొరక్క పస్తులు. ఆకలి చావులు.
-ఇది ఉమ్మడి రాష్ట్రంలో దుస్థితి
నిరంతర వెలుగులు, చేతినిండా పని, వెల్లువలా పెట్టుబడులు, ఉపాధికి నిలయంగా మారిన రాష్ట్రం.
-ఇది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయం.
‘తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేంద్రం సహాయ నిరాకరణ, రెండేండ్ల కాలాన్ని కరోనా మింగేసినా.. రాష్ట్రంలో ఇండస్ట్రీల దూకుడు తగ్గలేదు. రాష్ట్రప్రభుత్వ అనుకూల విధానాలు, మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్షిప్తో తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. టీఎస్ ఐ-పాస్ చట్టం రాష్ర్టాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చింది’ అని అంటున్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) అధ్యక్షుడు మీలా జయదేవ్. తెలంగాణలో పారిశ్రామిక రంగం సాధించిన ప్రగతి, భవిష్యత్తు అవకాశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
దేశంలో ఎక్కడాలేని పారిశ్రామిక అనుకూల విధానాలు తెలంగాణ ప్రత్యేకత. ఔషధ రంగానికి హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తున్నది. ఐటీలో అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ శరవేగంగా వృద్ధి చెందుతున్నది. ప్రభుత్వం ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహారశుద్ధి రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలసీల కారణంగా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయి.
భౌగోళికంగా, వాతావరణ పరంగా తెలంగాణకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. వరదలు, భూకంపాలకు అవకాశాలు చాలా తక్కువ. టీఎస్ ఐ-పాస్ చట్టం, ప్రభుత్వ స్నేహ పూర్వక విధానాలు, రాయితీలు ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణకు దోహదం చేసే అంశాలే. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో ఇండస్ట్రియల్ పార్క్లకు పరిశ్రమలు తరలివస్తున్నాయి.
తెలంగాణ ఏర్పాటుకు ముందు పారిశ్రామికరంగం మందగమనంతో సాగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఫలితంగా డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడమే కాకుండా భారీగా పెట్టుబడులను రాబట్టింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టి జరిగింది. సులభతర విధానాలు అమలు చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో 2016 నుంచి వరుసగా తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం నానా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ఏర్పాటుతో పారిశ్రామికరంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
పారిశ్రామికరంగానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తున్నది. ముఖ్యంగా టీఎస్ ఐ-పాస్ ద్వారా నిర్ణీత గడువులోగా అన్ని అనుమతులు మంజూరవుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు పెట్టుబడిదారులను మరింత ఆకర్షించేలా చేస్తున్నాయి. విద్యుత్, నీటి సరఫరా నిరంతరాయంగా సాగుతున్నది. మౌలిక సదుపాయాలకు కొదవలేదు. దీంతో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ పేరు ప్రఖ్యాతులు ఖండాంతరాలకు విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధిరేటు ఏటా పెరుగుతుండటం నూతన పెట్టుబడులకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం సరిపడా నిధులు విడుదల చేయడం లేదనే విమర్శలున్నాయి. ఉదాహరణకు 2011లో మంజూరైన నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)కు కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అది ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్కు మెగా ప్రాజెక్టు హోదా దక్కింది. రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టులేవీ పెద్దగా రావడంలేదు. నిమ్జ్కు నిధులు మంజూరు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా నేను అభివర్ణిస్తాను. కరెంటు ఉంటేనే పరిశ్రమలు నిలబడతాయి. ఉత్పాదక శక్తి పెరుగుతుంది. ఉపాధి కల్పన మెరుగవుతుంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంపై దృష్టి సారించారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల దాకా అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నారు. అయితే ఫ్యూయిల్ సర్ఛార్జ్ అడ్జెస్ట్మెంట్ (ఎఫ్ఎస్ఏ) మాత్రం కొంత భారంగా మారింది. దీనిని వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఎఫ్ఎస్ఏను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇక గడచిన పదేండ్లలో కరెంటు లేక మూతపడిన పరిశ్రమ ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడేలు నిత్యకృత్యంగా ఉండేవి. సరైన విద్యుత్ సరఫరా లేక పారిశ్రామికరంగం కుంటుపడింది. 50 శాతం స్టీలు పరిశ్రమలు, 40 శాతం ఎంఎస్ఎంఈలు, ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు మూతపడ్డాయి.
రాష్ట్రంలో సరుకుల రవాణాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వాయు, రోడ్డు, రైలు మార్గాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సరుకు రవాణా చేసేందుకు డ్రైపోర్ట్- ఇన్లాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కంటెయినర్ల ద్వారా సీపోర్ట్ వరకు సులభంగా సరుకుల రవాణా చేసుకునేందుకు వీలు కల్పించాలి. రవాణా రంగాన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉంది. రవాణా ఖర్చులు తగ్గితే ఉత్పాదక వ్యయంతోపాటు వినియోగదారులపైన భారమూ తగ్గుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ అనుకూల విధానాల వల్ల అనేక రంగాల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తున్నది. ఐటీ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. 2015లో రూ.57 వేల కోట్ల ఎగుమతులు జరుగగా, 2022-23కు రూ.2.41 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 44 శాతం ఉద్యోగాలు ఐటీతోపాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించినవే. రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు ఫుడ్పార్క్లు ఏర్పాటవుతున్నాయి. ఔషధ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల పెట్టుబడులు రాగా, 4.5 లక్షల ఉద్యోగాలు లభించాయి. హైదరాబాద్ గ్లోబల్ వ్యాక్సిన్ హబ్గా ఎదిగింది. టాప్-10 ఔషధ కంపెనీలు సహా వెయ్యికిపైగా లైఫ్సైన్సెస్ రంగ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి.
ఇతర రాష్ర్టాల్లో కూడా పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం ఉన్నప్పటికీ టీఎస్ ఐ-పాస్ అంత కచ్చితంగా అమలు కావడంలేదు. అధికారులను బాధ్యులను చేయడం టీఎస్ ఐ-పాస్ ప్రత్యేకత. జాప్యానికి కారణమయ్యే అధికారికి జరిమానా విధించడం దేశంలో ఎక్కడా లేదు. నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల జాప్యానికి అవకాశం లేకుండా పోయింది. భారీ పరిశ్రమలకు సీఎంవో స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతున్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.
దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర. ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రభుత్వరంగంలో పరిశోధన సంస్థలను కేంద్రం ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేసి రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు భూములు కేటాయించడంతోపాటు ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసువాలి. పన్నుల భారాన్ని తగ్గిస్తే పారిశ్రామికరంగం మరింత బలోపేతం అవుతుంది. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లు, టెస్టింగ్, గ్రేడింగ్ సౌకర్యాలను ఏర్పాటుచేయాలి.
-కిశోర్ శుక్ల