Bab El Mandeb : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ (Israel) సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ (Bab El Mandeb) జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ (Iran) హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇప్పటికే ఉన్న ఆంక్షలతో సతమతమవుతున్న ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఈ తాజా పరిణామం కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. జూన్ 1న ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో పరోక్షంగా జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు, బాబ్ అల్-మందెబ్ సహా పలు మార్గాల్లో ప్రతిఘటనను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయడంపై ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొన్నది.
దక్షిణ లెబనాన్లో పౌరులు, పారామెడిక్స్ మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా, యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్-మందెబ్ జలసంధి ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ టియర్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 12-15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్కు ప్రత్యక్ష నియంత్రణ లేనప్పటికీ, యెమెన్లోని హౌతీల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది.
లెబనాన్, గాజాలలో ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే, తమ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ హర్మూజ్ తరహాలోనే బాబ్ అల్-మందెబ్లో కూడా నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టంచేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 1న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికిపైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది. మరోవైపు రాబోయే వారంలోగా హర్మూజ్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరాన్తో కొత్త ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.