T Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్తున్నారని నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణ శుక్రవారం అక్షర సత్యమని తేలింది. తెలంగాణ కాంగ్రెస్కు అధిష్ఠానం ఢిల్లీలో ఉందా? లేక బెంగళూరులోనా? అన్నది ఆ పార్టీ శ్రేణులకే అంతుబట్టకుండా ఉన్నది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు తెలంగాణలో కూడా పార్టీని గట్టెక్కించే బాధ్యతను అధిష్ఠానం పెద్దలు అప్పగించినట్టు తెలుస్తున్నది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఢిల్లీలో ఖరారు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు తప్ప వ్యవహారమంతా కర్ణాటక నుంచే నడిపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నిర్ణయాలన్నీ కర్ణాటకలోనే జరుగుతున్నాయి. కాంగ్రెస్లో విలీనం కావాలనుకుంటున్న పార్టీలు, టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా బెంగళూరుకే వెళ్తున్నారు. పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే బాధ్యతను కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేపట్టారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తున్నది. బెంగళూరులో గురువారం ఐటీ అధికారులకు దొరికిన రూ.42 కోట్లు తెలంగాణకు తరలించేందుకు దాచినట్టు సమాచారం. ఈ సొమ్ము పట్టిబడింది డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడైన అంబికాపతి, ఆయన భార్య ఆశ్వత్త ఇంట్లోనే కావడం గమనార్హం. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వాన్ని 40 శాతం పర్సంటేజీ సర్కార్గా విమర్శించి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 50శాతం టార్గెట్గా పెట్టి కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నట్టు బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా వసూలు చేసిన సొమ్ముతో తెలంగాణలో ఎలాగైనా గెలవడానికి కర్ణాటక నేతలు ప్రయత్నిస్తున్నారు. అవే కాకుండా ఇక్కడ తెలంగాణలో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహుల నుంచి కూడా కోట్లకు కోట్లు వసూలు చేసి వాటిని నియోజకవర్గాలకు తరలిస్తున్నట్టు సమాచారం.
‘డీకే’ ను కలవండి?
తెలంగాణలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని ఢిల్లీ వెళ్లిన నేతలను పార్టీ పెద్దలు బెంగళూరుకు వెళ్లి డీకే కలవాలని చెప్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ను కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మంత్రాంగమంతా బెంగళూరు నుంచే జరుగుతుందనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నించిన మోత్కుపల్లి నర్సింహులు బెంగళూరుకే వెళ్లి డీకేతో మంతనాలు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీ, వీహెచ్ హనుమంతరావు తదితరులు ఢిల్లీ కంటే బెంగళూరు చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ను శాసించే స్థాయికి చేరుకోవడంతో భవిష్యత్లో జరిగే పరిణామాల పట్ల తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.