పాలమూరుకు వాపస్ వచ్చిన వలస సోదరులంతా పరవశంతో కొలువుదీరినట్టు..
పాలమూరులో పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల నీళ్లన్నీ పరవళ్లు తొక్కినట్టు..
పాలమూరు పచ్చటి పంట పొలాల్లో సంతోషాల గులాబీలు విరగపూసినట్టు..
పాలమూరు కల్లాల్లో పట్టని ధాన్యపు రాశుల్ని మైదానంలో గుమ్మరించినట్టు..
పాలమూరు పల్లి పలుకుల కమ్మదనం.. ఊరు ఊరంతా వ్యాపించినట్టు…
మంగళవారం నాగర్కర్నూల్లో జరిగిన బహిరంగసభకు పాలమూరు ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుర్చీలు చాలనంత మంది.. పట్టణంలో పట్టనంత మంది… మైదానమే మునిగిపోయేంత మంది!
అన్ని లక్షల మందీ… కేసీఆర్ వచ్చినప్పుడు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్! ప్రసంగం ముగియగానే లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్! ఆయన మాట మాటకూ ఆపలేనంత హర్షాతిరేకం! కేసీఆర్ మనసు నిండా పాలమూరు ప్రజలే! పాలమూరు గుండె గుండెనా కేసీఆరే!
అది జనమా..కాదేమో! తమ బతుకుల్ని బాగుచేసిన ఇంటి మనిషిపై ఉప్పొంగిన ప్రేమ!
ధరణిని ఎవరైతే బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పారో వాళ్లు వేసేది ధరణిని కాదు.. రైతులను వాళ్లు బంగాళాఖాతంలో వేస్తున్నట్టే. కొంతమంది గొడ్డలి భుజం మీద పెట్టుకొని తయ్యార్గా ఉన్నరు. నమ్మి ఒకవేళ అధికారం ఇచ్చినమో.. పంటికి అంటకుండా మింగేస్తరు. జాగ్రత్త!
-ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | నాగర్కర్నూల్నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: ధరణి పోర్టల్ను తీసేసి దళారీని తెచ్చేందుకు కొత్త వేషాలతో మోసగాళ్లు బయల్దేరారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అప్రమత్తంగా లేకపోతే మోసపోయి గోసపడుతామని రైతుల్ని హెచ్చరించారు. కాంగ్రెస్ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వాళ్లకు మళ్లా అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్కర్నూల్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీతోపాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో నెలకొన్న దుస్థితిని గుర్తుచేస్తూనే.. ధరణి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందో వివరించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘తెలంగాణను ఆగం పట్టించినోళ్లు మళ్లొస్తున్నరు ఇదివరకు తెలంగాణను ఆగం పట్టించినోళ్లు మళ్లా కొత్త వేషాలు వేసుకొని బయల్దేరిండ్రు. జడ్చర్లలో ఓ ప్రబుద్ధుడు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తా అంటడు. ధరణితో ఏం జరిగింది? ఇంతకుముందు రికార్డు అసిసెంట్లు, వీఆర్వోలు, గిర్దావర్లు, ఎమ్మార్వోల చేతిలో మన బతుకులుండేవి. వాళ్లు రాసిందే రాత, గీసిందే గీత. మన భూమి రికార్డుల ఉన్నదో తెలవదు. మన పేరుమీదనే ఉన్నదో లేదో తెలవదు. పహాణీ నకలు కావాలంటే పైసలు కట్టాలె. రాష్ట్రం రాకముందు తెలంగాణలో 459గా ఉన్న మండలాలను 612కు పెంచుకున్నం. మహబూబ్నగర్లో గతంలో 64 మండలాలు ఉంటే ఇయ్యాల వాటిని 76కు పెంచుకున్నం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15చోట్లనే ఉండె. పాత జిల్లా పరిధిలో ఇవ్వాళ 88 ఆఫీసులు ఉన్నాయి. పట్టా కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా లంచాలు. వీఆర్వోలకు, ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసులకు పైసలియ్యాలె.
గతంలో ధరణి లేనపుడు ఎవరైనా భూమి అమ్మాలన్నా, కొనాలన్నా పెద్ద ప్రహసనం. ఇవ్వాల రిజిస్ట్రేషన్ అయితే మన భూమి పట్టా మూడునెల్లకో.. ఆర్నెళ్లకో మన చేతికి వచ్చేది కాదు. గతంలో ప్రభుత్వం చేతిలో అధికారం ఉండేది. వీఆర్వో, ఎమ్మార్వో చేతిలో దస్త్రం ఉందేది. ప్రభుత్వం దగ్గరున్న అధికారాన్ని రైతులకు ఇచ్చినం. ఈ రోజు రైతు భూమి మారాలంటే.. వీఆర్వో లేనేలేడు, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టరో, కలెక్టరో, రెవెన్యూ మంత్రి, చీఫ్సెక్రటరీ, సీఎం అయిన నేను మార్చలేము. తన భూమిని మార్చుకోగలిగిన అధికారం దానిని అమ్మిన రైతుకు మాత్రమే ఇచ్చినం. ఆయన బొటనవేలు నొక్కితే తప్ప రికార్డు మార్చే శక్తి ఎవరికీ లేదు. పైగా ధరణితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరం అయ్యింది. పొద్దుగాల పోతే.. మధ్యాహ్నం కల్లా రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. ముందే స్లాట్ బుక్ చేసుకుని.. టైముకు ఆఫీసుకుపోతే 20 నిమిషాలల్ల రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. పాస్బుక్కు చేతికిస్తరు. ఇంతకుముందు భూమిలేనోళ్లు కొంటే టపాలోనే పాస్బుక్ ఇంటికొస్తున్నది. అంతకుముందు ఇట్లా ఉంటుండెనా? ఎన్ని ఆఫీసులు తిరగాలె? ఎంతమందికి సలాం కొట్టాలి? ఎంతమంది లీడర్లను పైరవీ చేయమనాలి? ఇప్పుడు ఆ గతి పోయింది. రైతు గుండెమీద చెయ్యి వేసుకుని నిశ్చింతగా, ధైర్యంగా ఉన్నాడంటే కారణం ధరణి.
పైరవీకారులు, రైతుల రక్తంతాగినవాళ్లే ధరణిని బంగాళాఖాతంలో వెయ్యాలనుకుంటున్నారు. వాళ్లే ఈ మాటలు మాట్లడుతరు. ధరణిని బంగాళాఖాతాలో విసిరేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈజీగా కడుపులో చల్ల కదలకుండా నేను హైదరాబాద్నుంచి రైతుబంధు డబ్బులు పంపిస్తే.. ఇక్కడ మీ సెల్ఫోన్లలో ‘టింగు.. టింగు.. టింగు’ అనుకుంటూ డబ్బులు పడిన మెసేజ్లు మీకు వస్తున్నాయి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తదా? రైతుబంధు రావాలంటే ఏం చెయ్యాలి? గిర్దావర్ ఇంటికి తిరగాలి. రికార్డు ఉన్నదా లేదా చూసుకోవాలి. ఉన్నది ఉన్నట్టు రాయాలంటే.. ‘తే.. లావ్’ అంటూ వాళ్లు చెయ్యిజాపుతరు. చెయ్యితడపకపోతే మాయమైతది. ధరణి లేకపోతే ఇవన్నీ ఉంటయ్.
కాంగ్రెస్రాజ్యంలో అపద్బంధు అని ఉండేది. నడుమల గద్దలు, నక్కలు, కుక్కలు తినంగా.. చనిపోయిన రైతు కుటుంబానికి 50వేలు కూడా సక్కగా రాలేదు. ఏడాది పొడవునా ఆఫీసుల చుట్టూ తిరిగితే.. 10వేల, 20వేలో చేతిలో పెట్టి ఇంటికి పంపేవాళ్లు. ఇవ్వాళ ధరణి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది? ఒక రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఒక దరఖాస్తు పెట్టేది లేదు. ఒక దఫ్తర్కు వెళ్లేది లేదు. ఎవరికీ పైసా ఇచ్చేది లేదు.. డైరెక్ట్గా రైతు కుటుంబం ఖాతాలోకి 5 లక్షలు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లోనే చూస్తున్నారు. ధరణి లేకపోతే అప్పుడేమవుతుంది? పైసలు వస్తాయా..? రావు..!
ఇప్పుడు రైతులు వడ్లు అమ్ముతుంటే.. ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. మీ అందరి రికార్డులు ధరణిలో ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి.. వడ్లు కొనంగనే మీ డబ్బులు వెంటనే బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. ధరణి లేకపోతే మళ్లీ ఇట్ల వస్తాయా? రావు!. ఎందుకంటే రైతులు చిట్టీలు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగాలి. సేట్ల చుట్టు తిరగాలి. 2-3 నెలలు తిరిగితే డబ్బులు వచ్చేవి కావు. మరి ధరణి ఉండాల్నా.. వద్దా.. ? ధరణి ఉండాలన్న వారు చేతులు లేపండి. (సభలోని వారంతా ధరణి ఉండాలంటూ నినదించారు. సీఎం వ్యాఖ్యలకు మద్దతుగా చేతులెత్తారు)
ధరణిని ఎవరైతే బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పారో వాళ్లు వేసేది ధరణిని కాదు.. రైతులను వాళ్లు బంగాళాఖాతంలో వేస్తున్నట్టే. కొంతమంది గొడ్డలి భుజం మీద పెట్టుకొని తయ్యార్గా ఉన్నరు. నమ్మి ఒకవేళ అధికారం ఇచ్చినమో.. పంటికి అంటకుండా మింగేస్తరు. జాగ్రత్త! ‘మందిమాటలు పట్టుకొని మారువానం పోతే.. మళ్లొచ్చేసరికి ఇల్లు కాలిపోయిందట’ అని పెద్దలు శాస్త్రం చెప్తరు. వీళ్లు దుర్మార్గులు, ఈ ప్రబుద్ధులు తాము అధికారంలో ఉన్నపుడు ఒక్కడు కూడా రైతుల గురించి ఆలోచించలేదు. ఒక్కడు కూడా రైతుబంధు ఇవ్వకపాయే. రైతులు చావకుండా చూడాలి. రైతులు వలస పోకుండా చూడాలి. కడుపునిండా కరెంటు ఇవ్వాలని ఒక్క మంత్రి, ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. మహబూబ్నగర్లో నాకన్న దొడ్డుగున్నవాళ్లు.. నాకన్న బలవంతులు లేకుండెనా.. మస్తుగ ఉండె. వాళ్లంతా యాడపన్నరు..? మళ్లా ఇవ్వాల వచ్చి మంచిగా తయారైన సిస్టమ్ను ఖరాబ్ చేస్తమంటున్నరు. ధరణితో కడుపులో సల్ల కదులుత లేదు. రైతుబంధు పైసలు, వడ్లమ్మిన పైసలు బ్యాంకులకే వస్తున్నయ్. రైతులు చనిపోతే బ్యాంకులోనే పైసలు పడుతున్నయ్. ఈ సౌలత్ వద్దనుకుందామా? జేబులోకి వచ్చే పైసలను బజారులో పారేద్దామా..?
ఆగమాగం కావద్దు.. ఆగమాగం అయితే తెలంగాణానే వచ్చేది కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పొద్దుగాల పోయి మధ్యాహ్నానికి వచ్చేస్తున్నం. ధరణి తీసివేస్తే రిజిస్ట్రేషన్ దోపిడీ, వీఆర్వోల దోపిడీ మొదలైతది. మళ్లీ పైరవీకారులందరూ వస్తరు. కాంగ్రెస్ రాజ్యంలో దళారులదే భోజ్యం. మళ్లీ మనను మింగేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాల పీడలేకుండా చేసినటువంటి అద్భుతమైన ధరణిని కోల్పోవద్దు. ఎట్టిపరిస్థితుల్లోను గతంలోని బాధలు మళ్లీ కొనితెచ్చుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ప్రభుత్వానికి నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఎన్నడన్నా వాళ్లు ఎవ్వరి గురించైనా పట్టించుకున్నారా..? ఒక జూనియర్కాలేజీ కావాలంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు 20 సంవత్సరాలు తిరిగిన. ఒక్క జూనియర్కాలేజీ కోసమే తిరిగిన. కానీ, ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా 1,001 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నం. స్కూళ్లతోపాటు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నం. ఇంతటి అద్భుత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పోగొట్టుకుందామా? మన వేలితోనే మన కంటిని పొడిపించేందుకు కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తరు. మనం మోసపోదామా? ధరణిని తీసేస్తామని, పైరవీకారులను తీసుకొస్తమని, వీఆర్వోలను మళ్లీ పెడుతం అనే పద్ధతిలో చేస్తామంటే ఊరుకోవద్దు.
ఈ రోజు చాలా దూరం వచ్చినం. తలసరి ఆదాయంలో మనమే దేశంలో నంబర్వన్. తలసరి విద్యుత్తు వినియోగంలో మనమే నంబర్వన్. ఒక్క తెలంగాణాలో తప్ప.. మరెక్కడైనా ఈ తరహా పథకాలున్నాయా..? రాష్ట్రం వస్తే కారుచీకట్లలోనే తెలంగాణ ఉంటుందని ఆంధ్రావాళ్లు శాపెనలు పెట్టిండ్రు. కానీ, ఇప్పుడు తెలంగాణ వెలుగుజిలుగులతో ధగధగా మెరిసిపోతున్నది. అదే ఆంధ్ర చిమ్మచీకట్లలో ఉన్నది. దేశంలో అన్నివర్గాలకు 24 గంటలపాటు కరెంటు ఇచ్చే రాష్ట్రం లేదు. రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం లేనేలేదు. దీన్ని మీరు పోగొట్టుకోవద్దు.
కంటివెలుగు పథకం తీసుకొచ్చినం. లక్షలాది మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చినం. ప్రభుత్వం ఇలా చేస్తదని గతంలో ఎవరైనా ఊహించారా? ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు గతంలో ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చిండ్రా? దేశంలోని మరే రాష్ట్రంలోనైనా ఇట్లా ఇస్తున్నారా? వేదనలో, బాధలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆలోచించాం. చాలా మేధోమథనం, ఆలోచన తర్వాత ఈ పథకాలు చేపట్టాం. ప్రజలందరనీ కాపాడుకోవాలన్న మానవీయ దృక్పథంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అసహాయులకు, నిస్సాహుయల కోసం పనిచేస్తున్నది.
ధరణితో 99 శాతం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నూటిలో ఒకరికి ఏదైనా సమస్య ఉంటే ఉండొచ్చు. వాళ్ల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 99 శాతం మందికి ఉపయోగపడేది వద్దట. గతంలో ఊరికి నలుగురు పైరవీకారులుండేవారు. రిజిస్ట్రేషన్ఆఫీసుకు పోతే అక్కడ గద్దల లెక్క పైరవీకారులు ఉండేవాళ్లు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచం పొయ్యాలి. అనేక బాధలుండేవి. వాటన్నింటిని అవతలపడేసి మేము ఈ రోజు రైతుకే అధికారం ఇచ్చినం. మీరు మార్చాలనుకుంటే మీ బొటనవేలితో నొక్కితే తప్పితే మీ రికార్డును ప్రపంచంలోని ఏ శక్తి కూడా మార్చలేదు. నీ చేతిలోకి అధికారం ఇచ్చే మంచి విధానాన్ని ఉంచుకుంటవా? పోడగొట్టుకుంటవా? రైతులే ఆలోచించుకోవాలె! నేను చెప్పే మాటను ఈ సభలో ఉన్నవారు మీ మీ ఊర్లకు వెళ్లిన తర్వాత చర్చకు పెట్టాలి. కేసీఆర్ చెప్పింది ఎంతవరకు నిజమో చర్చించాలి. వాస్తవాలు అందరికీ తెలియాలి.
ఒకప్పుడు ఎండిపోయిన బీడు భూములతో ఉన్న పాలమూరు.. గుక్కెడు నీటి కోసం పరితపించిన పాలమూరులో ఇప్పుడు పచ్చని భూములు కనిపిస్తున్నాయి. నిండుకుండలా నీళ్లున్నాయి. నా జీవితంలో తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత సంతృప్తినిచ్చిన విషయమిది. నాది ఒక శపథం. నేను ఏది తలపెట్టినా భగవంతుడు నన్ను ఓడించలేదు. గెలిపించిండు. మనం పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్లలో 70-80 టీఎంసీల సామర్థ్యంతో కట్టుకుంటున్నాం. అవి ఒక్కసారి నిండినయంటే నా పాలమూరు బంగారు తునక. బ్రహ్మండమైన పంటపండుతుంది. ఇప్పుడు ఆగస్టు మాసంలో ఈ రిజర్వాయర్లన్నింటినీ నీళ్లతో నింపబోతున్నాం. మీరే కండ్లతో చూడబోతున్నారు. నేను మాట ఇస్తున్న. వీటిని నింపుతామని.
బీఆర్ఎస్పార్టీ ప్రభుత్వం అంటేనే రైతురాజ్యం. మీ అందరికీ తెలుసు. మీరంతా పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నరు. నేను మహారాష్ట్రకు వెళ్తే.. తెలంగాణ మాడల్ మాకు కావాలని అక్కడి వాళ్లు అడుగుతున్నరు. పట్వారీలు మా రక్తం తాగుతున్నరు. తెలంగాణాలో ఉన్న ధరణి మాకు కావాలని అడుగుతున్నరు. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకం బాగుందని జేజేలు పలుకుతున్నరు. మన దగ్గరేమో ఈ దుర్మార్గులు మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే దోచుకుంటం. వీర్వోలను పెడుతం. మీ నెత్తురు తాగుతం.. అన్నట్టు మాట్లాడుతున్నరు. దయచేసి నాగర్కర్నూలు వేదికగా రాష్ట్ర రైతాంగానికి నాదో విజ్ఙప్తి. ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఆలోచించండి. ఒకవేళ ధరణి లేకపోతే లక్షల కోట్ల విలువైన ఈ భూములకు ఎన్ని పంచాయతీలయ్యేవి? ఎన్ని పోలీసు కేసులయ్యేవి? ఎన్ని మర్డర్లు జరిగేవి? ఇప్పుడు అవన్నీ లేవు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నయ్. వీళ్లకు పల్లెలు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు. వడ్లమ్మిన వెంటనే పైసలు బ్యాంకులో వచ్చి పడుతున్నాయి. రైతుబంధు పైసలు వచ్చిపడుతున్నాయి. దీనితో రైతులు సక్కగ వెళ్లి మందులు కొంటున్నడు. విత్తనాలు కొనుక్కుంటున్నడు. మంచిగ పొలం దగ్గరకు పోతున్నడు. మరి రేపు ధరణిపోతే ఏమవుతుంది? రైతు పొలం దగ్గరకు పోలేడు. 2-3 నెల్ల దాకా షావుకారు ఇవ్వడు. అక్కడికి ఇక్కడికి తిరగాలె. భూముల కోసం నెత్తులు పగులగొట్టుకోవాలె. గెట్టు పంచాయతీలు తెంపుకొనేందుకు పోలీసు స్టేషన్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలె. రైతులందరినీ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలన్నది కాంగ్రెస్ కుట్ర. ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు కాపాడుకుంటరా? కోల్పోతారా? అనేది మీరే తేల్చుకోవాలి. రైతుబంధు తెచ్చినా.. రైతు బీమా ఇచ్చినా.. రైతులకు 24గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చినా.. రైతులను కంటికి రెప్పలెక్క కాపాడుకోవాలనే ధరణి తెచ్చినా రైతు బాగు కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదు. రైతుబంధు, రైతుబీమా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీనో, కాంగ్రెస్పార్టీనో వారి జీవితంలో మాట్లాడిందా? ఆ పార్టీల నాయకులకు ఆలోచననైనా తట్టిందా? మీ బిడ్డగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్న. మోసపోతే గోసపడ్తం. అప్రమత్తంగా ఉండాలె.
గిరిజనులకు మనం పోడు భూములు పంచుకుంటున్నం. సొంతజాగ ఉన్నవాళ్లకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు ఇస్తున్నం. తమ జిల్లా ప్రజల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని శ్రీనివాస్గౌడ్సహా జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కోరారు. వారి కోరిక మేరకు ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి నాలుగువేల ఇండ్ల చొప్పున మంజూరు చేస్తున్నాం. వృత్తి పనులు చేసుకునే బీసీలకు ప్రత్యేకంగా రూ.లక్షను ప్రతి కుటుంబానికి అందజేస్తాం. 9వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. బీసీ కులాలందరికీ ఇది ఎంతో ఉపయోగం. దీన్ని వాడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో పాలన సాగిస్తున్నది. మనకు కులం, మతం లేదు. అందరూ సమానమే. అందరూ తెలంగాణబిడ్డలే. అందరూ చల్లగుండాలన్నదే మన లక్ష్యం. అందుకే అనేక పథకాలు పెట్టాం.
నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని గతంలో మీ అందరిని అడిగితే.. ‘పో బిడ్డా.. నీకు మేమున్నం’ అని అన్నరు. నా బలం, నా బలగం మీరే. మీ ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నా. ధరణి విషయంలో కూడా నేను మిమ్మల్ని మరోసారి అడుగుతున్నాను. ధరణి ఉండాలా.. వద్దా.. (ప్రజల నుంచి అద్భుతమైన స్పందన. ధరణి ఉండాలనే నినాదాలు) ప్రజలందరూ ధరణి ఉండాలని కోరుకోంటున్నరు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే మీ అధికారులకు, మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి. వారు వాటిని పరిష్కరించేందుకు సహాయం చేస్తారు.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. జై తెలంగాణ.. జై భారత్ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.