కమలాపూర్, మార్చి 25 : సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలకళను సంతరించుకున్నాయి.
హనుమకొండ జిల్లా కమలాపురం మండలం శంభునిపల్లి, కానిపర్తి, గూడూరు, అంబాల, నేరెళ్ల, గూనిపర్తి, మాధన్నపేట, శనిగరం, గోపాల్పూర్, వంగపల్లి గ్రామాలను కలిపే వాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు చెక్ డ్యామ్లు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీ జలాలు వస్తుండటంతో వాగుల్లో నీరు చేరి చెక్డ్యామ్లు నీటితో నిండాయి. నీటి కష్టాలు తీరడంతో పది గ్రామాల రైతులు వానకాలం, యాసంగిలో ధైర్యంగా వరి సాగు చేస్తున్నారు.