Congress-BJP | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘స్నేహ బంధమూ.. ఎంత మధురమూ..’ అని పాడుకుంటున్నాయి కాంగ్రెస్-బీజేపీ. పెద్దసార్లే కలిసిపోగా లేనిది, మనకేమైందంటూ కిందిస్థాయి నేతలు కూడా చేతిలో చెయ్యేసి హాయిగా డ్యూయెట్లు పాడుకుంటూ బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవిశ్వాసాలే అందుకు అతిపెద్ద ఉదాహరణ. సిద్ధాంతాలు పట్టుకుని వేలాడితే పదవులు వస్తాయా? పాడా? అనుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ పదవుల పంపకాల్లో బిజీగా మారారు. అందులో భాగంగా బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లను పదవుల్లోంచి తొలగించేందుకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు.
అవిశ్వాసాలు ఇలా
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య దోస్తీ బలపడుతూ వస్తున్నది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా జరుగుతున్నదని ఇరు పార్టీల నేతలు చెబుతున్నా, అంతర్గతంగా మాత్రం రెండు జాతీయ పార్టీల మధ్య స్నేహం బలంగా పెనవేసుకుపోయిందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ మధ్య దోస్తీ మరింత బలపడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వీటి మధ్య సయోధ్య కనిపించింది. ఇప్పుడు బహిరంగమైపోయింది. మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు, కుర్చీల పంపకాలు అందులో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.