భీమదేవరపల్లి, జనవరి 11: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత వీఐపీ దర్శనం(Free VIP darshanam) రద్దు(Canceled) చేసినట్లు ఆలయ ఈవో కిషన్రావు గురువారం వెల్లడించారు. ఇటీవల కొత్తకొండ(Kothakonda jathara)లో వీరభద్రస్వామి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీఐపీ పాసులకు రూ. 200 చొప్పున టికెట్ ధర నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తరఫున రూ. 200 చొప్పున 500 వీఐపీ పాసులు, రూ.100చొప్పున 500 శీఘ్ర దర్శనం టిక్కెట్లను రూ.1,50,000చెల్లించి కొనుగోలు చేశారని ఈవో వెల్లడించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్న సాధారణ భక్తులకు కాసింత ఊరట లభించనుంది.