హైదరాబాద్ : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళల కోసం పలు నజరానాలను ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మహిళల కోసం పీక్ అవర్స్లో నాలుగు ప్రత్యేక ట్రిప్పులను ప్రయోగాత్మకంగా సంస్థ నడపనుంది. ఆయా బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన మహిళలు మార్చి 8న వయసు రుజువు ఉన్న ఐడీని చూపించి.. ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
అలాగే.. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో… మహిళా పారిశ్రామికవేత్తలు, ఎన్హెచ్జీ లేదా డ్వాక్రా గ్రూప్ల ద్వారా ఉత్పత్తులు, సేవల ప్రదర్శన, విక్రయం కోసం ఉచిత స్టాల్స్, స్పేసెస్ను మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా అందించాలని సంస్థ నిర్ణయించింది.
మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను కూడా సంస్థ కల్పించనుంది. టీఎస్ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తి గల మహిళలకు 30 రోజుల పాటు ఉచిత హెవీ మోటర్ వెహికిల్ శిక్షణ అందించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఆసక్తి ఉన్న మహిళలు 31 మార్చి 2022లోపు తమ పేర్లను సమీపంలోని డిపోలో నమోదు చేసుకోవచ్చు. శిక్షణ పొందిన మహిళలకు జిల్లా కేంద్రంలోని సంబంధిత శిక్షణ కేంద్రాలలో సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్ఎంవీ లైసెన్స్ (కనీస 2 సంవత్సరాలు) కలిగి ఉండాలి, కోర్సులో చేరడానికి ముందు ఆర్టీఏ నుంచి లర్నర్ లైసెన్స్ పొంది ఉండాలి.
మార్చి 8 నుంచి 14 వరకు టీ24 టికెట్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో ప్రయాణంపై 20 శాతం తగ్గింపు లభించనుంది. వాస్తవ ధర రూ.100 కాగా.. ఆయా రోజుల్లో రూ.80 కే అందిస్తారు. వరంగల్లోనూ ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. అక్కడ టీ 24 టికెట్ ధర రూ.60 ఉండగా రూ.50 కే అందజేయనున్నారు.
గర్భిణీ, పాలిచ్చే తల్లుల కోసం అన్ని ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో రెండు సీట్లు ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తారు. పల్లె వెలుగు బస్సుల్లో సీటు నంబర్లు 4, 5, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్ నంబర్లు 1, 2 ను సంస్థ వాళ్ల కోసం కేటాయించింది. సిటీ ఆర్డినరీ/మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్లలో డ్రైవర్కు వెనుక వైపు రెండు సీట్లు కేటాయించారు. ఈ సీట్లన్నీ పర్పుల్ కలర్లో ఉంటాయి. మహిళల కోసం కేటాయించిన సీట్లలో మహిళలు మాత్రమే కూర్చునేలా సంస్థ ప్రచారం నిర్వహించనుంది. సీట్లు ఖాళీగా ఉన్నప్పుడే, మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కే వరకు మాత్రమే పురుషులు వాటిని ఉపయోగించుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
అన్ని బస్ స్టేషన్లు, ట్రాఫిక్ రద్దీ పాయింట్ల వద్ద పర్పుల్ కలర్ బాక్స్లు ఉంటాయని, మహిళా ప్రయాణికులు మార్చి 31వ తేదీ వరకు ఈ బాక్స్లలో టికెట్ల వెనుక తమ పేరు, ఫోన్ నంబర్ను సరిగ్గా రాసి వాటిని ఆ బాక్సులలో డ్రాప్ చేయాలని సంస్థ కోరింది. అన్ని బస్ స్టేషన్లలో 2022 ఏప్రిల్ 2వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి.. డ్రాలో గెలుపొందిన విజేతలకు సంబంధిత డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి నెలవారీ సీజన్ టికెట్తో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ను సంస్థ అందించనుంది.
మహిళా ప్రయాణికులు.. టీఎస్ఆర్టీసీ టికెట్తో వారి ఫోటోను తీసుకొని సంస్థ వాట్సప్ నంబర్ 9440970000కు పంపిస్తే.. 2022 ఏప్రిల్ 2న బస్ భవన్లో లక్కీ డిప్ నిర్వహించి.. విజేతలకు ప్రత్యేక బహుమతిని సంస్థ అందించనుంది. మహిళా ప్రయాణికుల ఫిర్యాదుల కోసం.. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన సమస్యలకు మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రత్యేక మొబైల్ నంబర్ 9440970000 ను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది.