పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారు. తమవంతుగా సేవచేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. వేములవాడ నియోజకవర్గంలో పల్లెపల్లెనా వైద్యులతో శిబిరాలు ఏర్పాటు చేసి, పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు మల్కపేట రిజర్వాయర్ కట్టపై శ్రీకోదండ రామస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. తాను పుట్టి పెరిగిన ఊరు మల్కపేట గ్రామాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు. ప్రజాసేవలో తరిస్తున్నారు చల్మెడ.
చల్మెడ లక్ష్మీనరసింహారావు తండ్రి ఆనందరావు. టీడీపీ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రజాసేవలో ముందున్నారు. ఇదే బాటను లక్ష్మీనరసింహారావు ఎంచుకున్నారు. ఒకసారి ఎమ్మెల్సీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
మల్కపేటపై మమకారం..
చల్మెడ లక్ష్మీనరసింహారావు స్వగ్రామమైన మల్కపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. రూ.75లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. రూ.10లక్షలతో స్వశక్తి భవనాన్ని నిర్మించారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తన తల్లి జానకీదేవి జ్ఞాపకార్థం రూ.2కోట్లతో తన సొంత భూమిలో పాఠశాలను నిర్మించారు. మల్కపేట రిజర్వాయర్పై రూ.5కోట్లతో శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. బోయినపల్లి పాఠశాల కోసం 10గుంటల స్థలాన్ని ఇచ్చారు. ప్రజలకు శుద్ధ జలకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాసేవలో ముందున్నారు.
ఊరూరా ఉచిత వైద్య శిబిరాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఊరూరా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. చల్మెడ దవాఖాన ద్వారా 262 వరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 68 గ్రామాల్లో ఇంటింటా ఆరోగ్య సర్వే చేయించారు. అవసరమున్న వారికి కరీంనగర్లోని చల్మెడ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎందరికో ఆర్థికసాయం చేశారు.