Minister Talasani Srinivas Yadav | రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏండ్లలో కులవృత్తులను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల బాగోగులు పట్టించుకోని పార్టీల నేతలు ఎన్నికలు సమీపిస్తుండటంతో మోసపూరిత మాయమాటలతో ప్రజల వద్దకు వస్తున్నారని ఆరోపించారు. మోసగాళ్ల మాయ మాటలను నమ్మవద్దని తలసాని ప్రజలను కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో కులవృత్తుల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించి ఉన్నతంగా జీవించాలన్నదే ముఖ్య మంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. చెరువుల్లోని మత్స్య సంపదపై పూర్తి హక్కులను ప్రభుత్వం మత్స్యకారులకే కల్పించిందని స్పష్టంచేశారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజ్ల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా 2016 నుంచి రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు.
మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరులు కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా రొయ్య పిల్లలను కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నీటి వనరుల్లో చేప పిల్లలను విడుదల చేయడంతో మత్స్య సంపద వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.
చెరువుల్లోని చేప పిల్లలను కాపాడుకునే బాధ్యత మత్స్యకారులదేనని మంత్రి తలసా ని శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న చేప పిల్లలు నాణ్యతగా ఉన్నాయా? లేదా? అని మత్స్య సొసైటీ సభ్యులు పరిశీలించాలని సూచించారు. గతంలో సబ్సిడీపై వివిధ రకాల వాహనాలను అందజేశామని, చేపలు, చేపల వంటకాల విక్రయాలను జరుపుకొనేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనాలను 60 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో 2 కోట్ల చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య కారులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. అంతకుముందు శేరిగూడలో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫిష్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉప్పరిగూడలో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. అక్కడే కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.