రాజన్న సిరిసిల్ల, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయాలని సూచించారు. భారతదేశంలో డబుల్బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. సొంత జాగలో ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు ఇస్తామన్న ప్రతిపాదనల మేరకు, నియోజకవర్గాలవారీగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆకస్మికంగా మంత్రి పర్యటించారు. మధ్యాహ్నం సమీకృత కలెక్టరేట్కు చేరుకున్న ఆయన.. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో డబుల్బెడ్ రూం ఇండ్లు, మన ఊరు మనబడి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో అధికారులు చూపిన చొరవను మంత్రి ప్రశంసించారు.
ఎడ్యుకేషన్ హబ్గా రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉమ్మడి రాష్ట్రంలో 200 గురుకులాలుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000కి పైగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సీఎం ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్నారు. డిగ్రీ కళాశాలకే పరిమితమైన జిల్లాలో నర్సింగ్, ఇంజినీరింగ్, అంతర్జాతీయ డ్రైవింగ్ కళాశాల, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణ సాధించుకున్న వెంటనే దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత మన రాష్ర్టానిదేనని మంత్రి స్పష్టంచేశారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, విద్యు త్తు, సంక్షేమ రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని చెప్పారు. అన్ని రంగాల్లో చేపట్టిన ఎనిమిదేండ్ల ప్రగతిని ప్రజల ముందు పెడతామని చెప్పారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, టీఎస్టీపీసీ చైర్మన్ గూడూరి ప్ర వీణ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కలెక్టర్ అ నురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
మీ స్కూల్ చాలా బాగున్నది
‘మీ స్కూల్ చాలా చక్కగా ఉంది. సౌలత్లు బాగున్నాయి’ అంటూ మంత్రి కేటీఆర్ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులకు కితాబు ఇచ్చారు. మంగళవారం వేములవాడ మండలం అగ్రహారంలోని చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలోని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన పనులను డీఈవో ధనాలకోట రాధాకిషన్ మంత్రికి వివరించారు. ‘మన ఊరు-మన బడి’ ద్వారా జడ్పీహెచ్ఎస్లో రూ.40.91లక్షలు, ఎంపీపీఎస్లో రూ.27.27 లక్షలతో పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎలక్ట్రిసిటీ, కిచెన్ షెడ్, ప్రహరీ, సంప్, ఫ్యాన్లు, పెయింటింగ్ పనులు చేసినట్టు వివరించారు. ఎంపీపీఎస్లో పనులను పరిశీలించిన మంత్రి.. పనులు బాగున్నాయని కితాబునిచ్చారు.