హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సర్కారు కాలేజీల్లోని విద్యార్థులకు ఐఐటీలు, మెడికల్ సీట్లంటేనే అందనంత దూరం. మరీ ముఖ్యంగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీటిపై సరైన అవగాహనే ఉండదు. ఈ దూరాన్ని చెరిపేసేందుకు ఇంటర్ విద్య కమిషనరేట్ చర్యలు చేపట్టింది. వీటిల్లో సీట్లను సొంతం చేసుకొనేలా శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఎంసెట్తో పాటు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నది. ఇప్పటికే ఎంసెట్ శిక్షణపై ఓ నిర్ణయం తీసుకోగా, జేఈఈ, నీట్ శిక్షణ కూడా జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
ఇంటెన్సివ్ కోచింగ్
విద్యార్థులకు రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటెన్సివ్ కోచింగ్తోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు. జిల్లాకొక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి నుంచి రెండు నెలలు ఇంటర్తోపాటు సమాంతరంగా ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఉంటుంది. ప్రవేశ పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను ఎంపికచేస్తారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిశాక ఏప్రిల్, మేలో జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు రెసిడెన్షియల్ ఇంటెన్సివ్ శిక్షణ ప్రారంభిస్తారు.