వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్’ పేరుతో హామీలను ప్రకటించారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏదో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా వాటిల్లో కనీసం నాలుగైదు హామీలు కూడా నెరవేర్చని దుస్థితి. పైగా ఒకప్పుడు పండుగగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అష్టకష్టాలకు నిలయంగా మార్చింది. దుక్కి దున్నింది మొదలు పంట అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ నరకం చూపిస్తున్నది. అందుకే తెలంగాణ రైతాంగం ప్రభుత్వంపై తిరగబడుతున్నది.
నాలుగేండ్ల కిందట మొత్తం 34 హామీలతో వరంగల్ వేదికగా రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి రైతు డిక్లరేషన్ను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని, ఏకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ కూలీలకు కూడా రైతుభరోసా కింద ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరను పెంచి కొనుగోలు చేస్తామని, వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని.. ఇలా అనేక హామీలు గుప్పించారు.
ఈ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ఊరూరా ప్రచారం చేసింది. రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. రెండున్నరేండ్లుగా రైతు డిక్లరేషన్కు పాతరేసింది. 34 హామీల్లో కనీసం నాలుగు కూడా పూర్థిస్థాయిలో అమలు చేయలేదని రైతులే మండిపడుతున్నారు. రైతు భరోసా పేరుతో చేస్తున్న డ్రామాలే కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు దాపురిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు డిక్లరేషన్ విడుదల చేసిన వరంగల్ వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రైతు సంగ్రామ సదస్సు పేరుతో బుధవారం భారీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులను ఆయన క్షేత్రస్థాయిలో కలుసుకున్నారు. వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును ప్రకటించగానే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రైతు మేళా నిర్వహిస్తున్నది.
