ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 5 : ఈత సరదా విషాదాంతమైనది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఇబ్రహీం(ఆటో డ్రైవర్), ఇస్మాయిల్ (బన్నుల వ్యాపారం) అన్నదమ్ములు. ఉపాధి కోసం ఏపీలోని కర్నూల్ పట్టణానికి వెళ్లి జీవిస్తున్నారు.
ఇబ్రహీంకు ఇద్దరు కూతుళ్లు ఆఫ్రీన్(17), నౌషీన్(13), ఇస్మాయిల్కు కొడుకులు సమీర్ (18), రెహాన్(13) ఉన్నారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ సోదరి బోరవెళ్లిలో ఉంటున్నది. వేసవి సెలవులు కావడంతో ఎనిమిది రోజుల కిందట రెండు కుటుంబాలు బోరవెళ్లికి వచ్చాయి. చిన్నారులు సోమవారం ఉదయం 11 గంటలకు అత్త కొడుకు ఇమామ్(15)తో కలిసి 9 మంది మంగపేట సమీపంలోని కృష్ణానది వద్దకు సరదా కోసం ఆటోలో వెళ్లారు. అక్కడ నదిలో స్నానం చేసేందుకు ఐదుగురు నీటిలోకి దిగగా.. మరో నలుగురు చిన్నారులు ఒడ్డుపై ఉన్నారు.
రెహాన్ నీటిలో మునుగుతుండగా.. కాపాడేందుకు వెళ్లిన అఫ్రీన్, నౌషీన్, సమీర్ నీట మునిగి మృతి చెందారు. ఇమామ్ తృటిలో తప్పించుకున్నాడు. ఆదివారం రోజే అఫ్రీన్కు నిశ్చితార్థం జరగడం.. అంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.