మహబూబాబాద్ రూరల్, జనవరి 14 : పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామ శివారు ఆముతండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇస్లావత్ శ్రీను (35) తన కుమారుడు రిత్విక్ (6), కూతురు రిత్విక (4), అతడి తల్లి ఇస్లావత్ పాప (70), అత్త మాలోత్ శాంతి, బావమరిది సర్దార్ కలిసి ఆదివారం ఉదయం కుమారుడి పుట్టువెంట్రుకల కోసం సూర్యాపేట జిల్లా మిర్యాలపెంటలోని గుడియబాబా జాతరకు ఆటోలో వెళ్లారు. పుట్టు వెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా కంబాలపల్లి వద్ద మహబూబాబాద్ వైపు వెళ్తున్న కారు, ఆటోను ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, రిత్విక అక్కడికక్కడే చనిపోగా శ్రీను, అతని తల్లి పాప మృతిచెందారు. అత్త శాంతి, బావమరిది సర్దార్కు తీవ్రగాయాలు కావడంతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీను భార్య కొవిడ్ సమయంలో మరణించగా ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.