హైదరాబాద్, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ): బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్’ అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్షాకే షాకిచ్చారు. హీరోలుగా నిలిచిన నలుగురి నిబద్ధతను తెలంగాణ సమాజం కొనియాడుతున్నది. శభాష్ అని ప్రశంసిస్తున్నది. ఇది కదా తెలంగాణ చైతన్యం అంటూ నీరాజనాలు పడుతున్నది. బీజేపీతో చేస్తున్న రాజకీయ యుద్ధంలో న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారని.. పనులకు, పైసలకు అమ్ముడుపోతున్న నేటిరోజుల్లో నిఖార్సయిన కేసీఆర్ సైనికుల్లా వీరు తలపడ్డారని టీఆర్ఎస్ శ్రేణులు సంబురంగా చెప్తున్నాయి. గులాబీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్రెడ్డిలపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి.
తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ కొద్దిరోజులుగా టీఆర్ఎస్లోని కీలక నాయకులను టార్గెట్ చేసింది. ఇప్పటికే కొందరిపై ఆదాయపన్ను శాఖను ప్రయోగించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ప్రయోగిస్తామని, మనీలాండరింగ్ చట్టం కింద, ఫెమా కింద కేసులు పెడ్తామంటూ మరికొంత మందిని బెదిరించింది. సంబంధం ఉన్నా లేకపోయినా నోటీసులు ఇస్తామంటూ తీసుకెళ్లి పార్టీ మారాలంటూ కొందరిపై ఇప్పటికే ఒత్తిడి చేసింది. ఇక మరికొంత మంది నేతలపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి కూడా ఒడిగట్టింది. పార్టీ మారుతున్నారంటూ రోజూ ఫేకు ప్రచారాలు కూడా చేయించింది. టీఆర్ఎస్ నేతలపై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. రోజుకో నేతను టార్గెట్ చేసి వారిని లోబర్చుకునే ప్రయత్నం చేసింది. వీటన్నింటిని తిప్పికొడుతూ టీఆర్ఎస్ నిజమైన సైనికుల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. ఎక్కడిక్కడ బీజేపీ ఎత్తుగడలను చిత్తుచేస్తున్నారు.
‘ఆయన అమ్ముడుపోయారు.. వారు ఆత్మగౌరవం చాటారు’
రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల వేడి నెలకొన్న తరుణంలో.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం భంగపడడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. మునుడోడు ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 18వేల కోట్ల కాంట్రాక్టు పొందిన తర్వాతే బీజేపీలో చేరారని, కాంట్రాక్టు పనులకు ఆయన అమ్ముడుపోయాడని ఇప్పటికే మునుగోడు ప్రజానీకంలో అత్యధికులు భావిస్తున్నారు. ఇదే విషయమై నియోజకవర్గం అంతా ఇప్పటికే పోస్టర్లు వెలిశాయి. తాను 18వేల కోట్ల కాంట్రాక్టు పొందిన మాట వాస్తవమేనని ఓ టీవీ చానల్లో స్వయంగా రాజగోపాల్రెడ్డి అంగీకరించడం గమనార్హం. అదే సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు వంద కోట్ల డబ్బు ఇస్తామన్నా పట్టించుకోకుండా.. రాజకీయ నిబద్ధతను చాటుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. రూ.18వేల కోట్లను బీజేపీ నుంచి తీసుకున్న రాజగోపాల్ రెడ్డిని, కొనుగోలు కుట్రను ఛేదించిన నలుగురు ఎమ్మెల్యేలను పోల్చిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత నిఖార్సుగా ఉన్నారో చూడాలని.. తెలంగాణ ఆత్మగౌరవానికి వారు ప్రతీకలని పేర్కొంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందిస్తున్నారు.