హైదరాబాద్,జనవరి 15,(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 11న సిఫారసు చేసింది. జిల్లా జడ్జీల కోటాలో ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించింది. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలనా విభాగం రిజిస్ట్రార్ బీఆర్ మధుసూదన్రావును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం హైకోర్టులో చీఫ్ జస్టిస్ బదిలీ తర్వాత తాత్కాలిక సీజేతో కలిపి 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్త పేర్లను కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. ఈ లోగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా జరిగితే ఆ సంఖ్య 31కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కూడా సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది.
హైదరాబాద్లో ఐలయ్య, నాగమణి దంపతులకు 1973 జూన్ 14న రేణుక యారా జన్మించారు. హైదరాబాద్లోనే పాఠశాల విద్యను పూర్తిచేశారు. బషీర్బాగ్లోని పీజీ కాలేజీ అఫ్ లాలో 1998లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఫిలడెల్ఫి యా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చేశా రు. 1998లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాది అయి, సిటీ సివిల్కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేశారు. వ్యాట్ ట్రిబ్యునల్ జ్యూడీషియల్ సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా కూడా చేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ చెందిన నందికొండ పెంటయ్య, మణెమ్మ దంపతులకు నందికొండ నర్సింగ్రావు 1969 మే 3న జన్మించారు. హైదరాబాద్లోనే పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. సీఎంఆర్ కాలేజీలో 1995లో లా చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2012లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికయ్యాక విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. జ్యుడీషియల్ అకాడమీలో గుంటూరు, వరంగల్, ఎల్బీనగర్, సైబరాబాద్ ఎంఎస్ఐగా, న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. హైకోర్టు జ్యుడీషియల్ ఇన్ ఫ్రా రిజిస్ట్రార్గా చేశారు. ఇప్పుడు సిటీ స్మాల్కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డికి చెందిన ఈ తిరుమలాదేవి 1964 జూన్ 2న తిరుమలాదేవి జన్మించారు. హైదరాబాద్లోనే చదివారు. లా చేశాక హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్లో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్గా, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా చేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలైన్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఖాజీపేటలో బీ ఎల్లయ్య, అనసూయ దంపతులకు 1969 మే 25న మధుసూదన్రావు జన్మించారు. రైల్వే హైసూల్లో పాఠశాల విద్య, కాకతీయ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు.1999లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యాక నెల్లూరు, చిత్తూరు, మేడ్చల్ మలాజిగిరి కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా, వ్యాట్ జ్యుడీషియల్ సభ్యుడిగా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్గా (పరిపాలన) పనిచేస్తున్నారు.