Warangal | వరంగల్ రైల్వే స్టేషన్లో కూప్పకూలిన వాటర్ ట్యాంక్..నలుగురికి గాయాలు
వరంగల్ : ప్రమాదవశాత్తు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో 64,000 లీటర్ల సమార్థ్యం గల ట్యాంక్ నుంచి నీటిని వదిలే సమయంలో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు నీటి ప్రవాహానికి ట్రాక్లపై కొట్టుకుపోయి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరిని ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
మరో ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు సీనియర్ సిటిజన్లు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని, రైల్వే శాఖ పూర్తి ఖర్చును భరిస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ఫాం వద్ద రైలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.