ACB | గొర్రెల యూనిట్ల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు అధికారులు అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన అధికారుల్లో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధకశాఖ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్ ఉన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ జరిపారు. అయితే, బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 130 గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.10కోట్ల మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ సొత్తు బినామీ ఖాతాలకు నిందితులు మళ్లించినట్లు గుర్తించారు. నలుగురు అధికారులు ప్రధాన నిందితుడు మొయిద్తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ తేలింది. అయితే, గొర్రెల కొనుగోలు బాధ్యతలను రవి, ఆదిత్య చూడగా.. డబ్బులు జమ చేయడానికి ఇన్చార్జిలుగా రఘుపతిరెడ్డి, గణేశ్ ఉన్నారు. నలుగురు కలిసి మొయిద్ ఇచ్చిన ఖాతాల్లో అప్లోడ్ చేశారు. ప్రకాశం జిల్లా కొన్న గొర్రెలు మంచాలలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే, ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో గతేడాది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తును పోలీసులు అవినీతి నిరోధకశాఖకు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్న అధికారులు గురువారం నలుగురిని అరెస్టు చేశారు.