బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో శనివారం చోటుచేసు కొంది. మండలంలోని శెట్లూరుకు చెందిన కదిరిగ గంగారాం భార్య అంజవ్వ (48), కూతురు సోని (17), గంగారాం తమ్ముడు మారుతి కూతురు గంగోత్రి (11), కొడుకు ప్రశాంత్(7) బీర్కూర్ శివారులోని మంజీ రా నది సమీపంలో ఉన్న గైపీర్ల వద్ద పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బయల్దేరారు. నది దాటుతున్న క్రమంలో అందులోని ఇసుక కయ్యలో పడిపోయారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారి కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మళ్లీ గాలించగా నదిలో మృతదేహాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన నలుగురు ఒకేరోజు చనిపోవడంతో శెట్లూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి
శెట్లూరుకు చెందిన నలుగురి మృతి విషయం తెలుసుకొన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీఇచ్చారు.