ములుగు: మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. దీంతో ములుగు జిల్లాలో జాతర జరుగనున్న నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈమేరకు జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశించారు.
మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలనుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేలాను తలపిస్తుంది. నాలుగు రోజులపాటు గిరిజన సంప్రదాయాల ప్రకారం దీనిని నిర్వహిస్తారు. ఈనెల 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 23న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 24న దేవతల వనప్రవేశం ఉంటుంది.