రంగారెడ్డి/యచారం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలం గొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లగూడ గ్రామానికి చెందిన కాలేద్(10) , బబ్బు(11), ఇమ్రాన్ (11), రెహాన్(10) తమ తల్లిదండ్రులతో కలిసి దగ్గర్లో ఉన్న దర్గాకి వెళ్లారు. దర్గా నుంచి తిరిగి వస్తుండగా.. తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు గ్రామ సమీపంలో ఉన్న ఎర్రకుంట చెరువు దగ్గరకు చేరుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు.
కాగా, కుంటలో గతంలో జేసీబీతో గుంతలు తీశారు. ఈత రాకపోవడంతో చిన్నారులు ఆ గుంతల్లో మునిగి మృతి చెందారు. చిన్నారులు గుంతల్లోకి వెళ్లడం చూసిన పశువుల కాపరులు వారు తిరిగి బయటికి రాకపోవడంతో వెంటనే అందులోకి దూకి చిన్నారులను బయటికి తీశారు.
అప్పటికే నలుగురు మృతి చెందినట్లు గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ లింగయ్య తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.