హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్డీఎఫ్తోపాటు ప్రొటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసికెళ్లినట్టు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మీడియాకు వివరించారు. ఎస్డీఎఫ్ అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదని పేర్కొన్నారు.
ప్రొటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సీఎంను కలిసిన వారిలో తనతోపాటు పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారని చెప్పా రు. అంతకుముందు గన్మెన్ల కుదింపు అంశా న్ని ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్రెడ్డిని కలిసి వివరించినట్టు ప్రభాకర్రెడ్డి తెలిపారు. జిల్లాలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రు లు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సోమవారం కలిసినట్టు వివరించారు.
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము సీఎం కలిసిన అంశాన్ని రాజకీయం చేయవద్దని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీని సీఎం రేవంత్రెడ్డి ఎలా కలిశారో, తాము అలానే కలిశామని స్పష్టంచేశారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మెదక్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగురవేస్తామని మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.